యాక్సిడెంట్ లోయంగ్ డైరెక్ట‌ర్ మృతి

రోడ్డు ప్ర‌మాదాల‌కు ఎవ‌రూ అతీతులు కారు. టాలీవుడ్ లో రోడ్డు ప్ర‌మాదాల‌కు గురై చ‌నిపోయిన సెల‌బ్రిటీలు, వాళ్లు పిల్ల‌లు కొంత మంది ఉన్నారు. రోడ్డు ప్ర‌మాదాల గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానుల్ని, ప్ర‌జ‌ల్ని జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిస్తుంటాడు. సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి జాగ్రత్తలు చెబుతుంటాడు. కానీ విధికి ఎవ‌రు ఎదెరెళ్ల‌గ‌ల‌రు. తాజాగా ఓ రోడ్డు ప్ర‌మాదంలో యంగ్ డైరెక్ట‌ర్ మృతి చెందాడు. క‌నీసం అత‌ని తొలి సినిమా కూడా రిలీజ్ కాక‌ముందు ఆ యంగ్ డైరెక్ట‌ర్ ని మృత్యువు క‌బ‌ళించింది.

ఏ. ఆర్ . రెహ‌మాన్ మేన‌ల్లుడు జీవి ప్ర‌కాశ్ కుమార్ హీరోగా 4 జీ అనే సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ద‌ర్శ‌కుడు అరుణ్ ప్ర‌శ‌స్తే రోడ్డు ప్ర‌మాదంలో క‌న్ను మూసాడు. కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర అరుణ్ డ్రైవ్ చేస్తోన్న బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో అరుణ్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌దిలాడు. దీంతో కోలీవుడ్ షోక సంద్రంలో మునిగిపోయింది. అరుణ్ పెద్ద డైరెక్ట‌ర్ కాక‌పోయినా అంద‌రికీ బాగా తెలిసిన వ్య‌క్తి.

అరుణ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వ‌ద్ద ప‌లు సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసాడు. `ఐ ` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అరుణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని శంక‌ర్ తెలిపారు. తాజాగా అరుణ్ మృతితో శంక‌ర్ దిగ్ర్బాంతిని వ్య‌క్తం చేసారు. అరుణ్ కి కోలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉండేద‌న్నారు. అరుణ్ మ‌ర‌ణ వార్త గుండెలు పగిలే బాధని క‌లిగించింద‌ని వాపోయారు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ తన హార్డ్ వర్క్‌తో కెరీర్‌లో ముందుకు సాగాడు. అరుణ్ ఆత్మకి శాంతి కలగాలని శంక‌ర్ నివాళులు అర్పించారు.