యశోదా హాస్పటిల్ లో పోసాని, నేతల పరామర్శలు

ప్రముఖ రచయిత, దర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో చేరారు. పోసానిని పరీక్షించిన డాక్టర్లు శనివారం నాడు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పోసాని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉండగా.. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు.

ఇక పోసాని కృష్ణమురళీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. యశోదా ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోసానికి అందుతున్న వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సజ్జల ఆరా తీశారు.

సజ్జలతో పాటు వైఎస్సార్‌ రాష్ట్ర కార్యదర్శి, కమెడియన్ పృథ్వీ పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ గెలుపుకు తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే జగన్‌తో పాటుగా పాదయాత్రలోనూ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ పలు మీడియా సమావేశాలు నిర్వహించేవారు.