బిగ్‌బాస్‌షోలో యాంటీ క్లైమాక్స్! జనం ఛీకొట్టటం ఖాయం!

(శ్రవణ్ బాబు*)

బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైనప్పుడు కొద్ది రోజులపాటు నానిని జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి పెదవి విరిచారు చాలామంది. నానికూడా తొలినాళ్ళలో కొద్దిగా బెరుకుగానే కనిపించాడు. తన సహజమైన ఆత్మవిశ్వాసం కనిపించలేదు. కానీ మెల్లగా పుంజుకున్నాడు. వారం ముగియగానే వీకెండ్ లో వచ్చి, ఆ వారమంతా హౌస్ లో జరిగిన సంఘటనలను విశ్లేషించటంలో, సభ్యులు వ్యక్తిగత పనితీరు, ప్రవర్తనను అంచనా వేయటంలో మంచి పరిణతి ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అక్కడనుంచి అతను ఎక్కడా తడబడలేదు. బ్రహ్మాండంగా షోను నడిపించారు. తప్పులు చేసిన ఇంటి సభ్యులను గట్టిగా మందలించారు. సలహాలు, సూచనలు చక్కగా ఇచ్చారు.

 

అయితే షోను వందరోజులపాటు చక్కగా నడిపించిన నాని, చివరికి వచ్చేటప్పటికి తనకొచ్చిన పేరంతా పోయేలా ప్రవర్తించాడు అంటే కాస్త కటువుగా ఉంటుందేమోగానీ, ఈ షో వరకు మాత్రం జరిగింది అదే. తన తాజా చిత్రం దేవదాస్ విడుదల కాబోతున్నందున, కౌశల్ ఆర్మీకి భయపడి అలా ప్రవర్తించాడని అంటున్నారుగానీ, ఏది ఏమైనా ఈ షో వరకు మాత్రం నాని ప్రవర్తించిన తీరు సక్రమంగా లేదు.

 

ఆ వివరాలలోకి వెళ్తే, ఆఖరు వారానికి ముందువారం హౌస్ లో ఒక సందర్భంలో కౌశల్ మిగిలిన ఐదుగురు సభ్యులను కుక్కల్లాగా మీదపడుతున్నారని అన్నాడు. దీనిపై హౌస్ లో మిగిలిన ఐదుగురు సభ్యులూ మండిపడ్డారు… తమని కుక్కలతో పోల్చినందుకు. తర్వాత వచ్చిన వీకెండ్ లో నాని ఈ ఘటనపై స్పందించాడు. ముందుగా కౌశల్ తప్ప మిగిలినవారందరితో మాట్లాడి, వారందరినీ తప్పుబట్టాడు. తనీష్ నయితే తీవ్రంగా మందలించాడు. చివరికి కౌశల్ దగ్గరికి వచ్చేటప్పటికిమాత్రం చాలా మృదువుగా మాట్లాడుతూ, ఆ గొడవను మామూలు విషయమన్నట్లుగా వ్యాఖ్యానించాడు. చివరికి కౌశల్ కుక్కలు అనటానికి ఒక పరమ చెత్త వివరణ ఇచ్చినాకూడా దానిని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు. కౌశల్ వివరణ పరమ చెత్తగా, అర్థరహితంగా ఉందన్నది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్లుగా ఉన్నాకూడా నాని దానిని పట్టించుకోకపోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా ఈ షోలో నానీకి వచ్చిన పేరంతా అలా ఒక్కదెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది.

 

అసలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఓటింగ్ ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా, ఈ వారం నాని కంపీరింగ్ షోను మరింత పలచన చేసిందని చెప్పాలి. దీనికి తోడు దీప్తి నల్లమోతు అభిమానులు, కౌశల్ అభిమానులకుమధ్య సోషల్ మీడియాలో చోటుచేసుకున్న గొడవ బిగ్ బాస్ షోను మరింత వివాదాస్పదం చేసింది. దీప్తికి ఆఖరివారాల్లో ఓట్లు ఒక్కసారిగా పెరగటంతో, ఆమెపై కౌశల్ ఆర్మీ సభ్యులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ ను నిర్వహించే రామ్ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ ప్రతినిధులను విపరీతంగా ట్రోల్ చేయటం,ఫోన్లు చేసి వ్యక్తిగతంగా బెదిరించటంతో ఆ సంస్థ ప్రతినిధులు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా, తాము దీప్తి నల్లమోతు సోషల్ మీడియా ఎకౌంట్ ను నిర్వహిస్తామని రామ్ ఐటీ సొల్యూషన్స్ ప్రతినిధులు స్వయంగా చెప్పారు. దీనితో ఫేక్ ఎకౌంట్లతో ఓట్లు వేయటంపై అందరి దృష్టీ మళ్ళింది. ఇప్పటిదాకా కౌశల్ మనుషులే ఫేక్ ఎకౌంట్లతో ఓట్లు వేస్తున్నారేమనని అనుమానాలు ఉండగా, ఇప్పుడు దీప్తిపైకూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే వీళ్ళిద్దరికీ ఫేక్ ఎకౌంట్లతో ఓట్లు పడటంపై ఎవరిదగ్గరా ఆధారాలు లేవుగానీ, అలా ఫేక్ ఎకౌంట్లతో ఓట్లు వేసే అవకాశాలు మాత్రం బోలెడు ఉన్నాయని ఐటీ నిపుణులు తేల్చి చెప్పటంతో హౌస్ లో కంటే ఇప్పుడు బయట జరుగుతున్న వ్యవహారాలపైనే ఆసక్తి పెరిగింది.

 

వాస్తవానికి బిగ్ బాస్ పోటీలోని సభ్యులకు ఓటు వేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి – ఒక నిర్దేశిత నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వటం, మరొకటి – ఆన్ లైన్ లో జీమెయిల్ ఎకౌంటుతో ఓటు వేయటం. ఈ రెండో పద్ధతిని దుర్వినియోగం చేయటానికి పలు మార్గాలున్నాయని, కొద్దిగా ఎస్ఈఓ(search engine optimization) పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా దీనిని చేయొచ్చని బయటపడింది. సెలబ్రటీల సోషల్ మీడియా ఎకౌంట్లను, పీఆర్(public relations)ను నిర్వహించే సంస్థలు రోజువారీగా చేసే పనే ఇదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. మామూలుగా అయితే ఒక జీమెయిల్ ఎకౌంటుతో ఒకరు రోజుకు ఒక్కసారి మాత్రమే ఓటు వేయొచ్చు. కానీ ఒకే ఒక వ్యక్తి తన కంప్యూటర్ నుంచే వేలసంఖ్యలో, లక్షల సంఖ్యలో ఫేక్ జీమెయిల్ ఎకౌంట్స్ సృష్టించి ఓట్లు వేయొచ్చని ఐటీ నిపుణులు తెలుపుతున్నారు. దీనికోసం RPA(రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్),సెలీనియమ్ స్క్రిప్ట్ వంటి పలు అప్లికేషన్స్ నెట్ లో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఇదే కాకుండా, అలా సృష్టించిన నకిలీ ఎకౌంట్లద్వారా తమకు కావాల్సిన వ్యక్తికి ఒక మనిషి కూర్చుని ఓట్లు వేయనవసరంకూడా లేకుండా ఆటోమేటిక్ గా ఓట్లు పడేటట్లు చేసే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని తెలుపుతున్నారు. ఈ పనులన్నింటినీ తమ ఐపీ అడ్రస్ బయటపడకుండానే చేయటానికి అనేక అవకాశాలున్నాయని చెబుతున్నారు.

 

ఇదిలా ఉంటే కౌశల్ ఆర్మీ సభ్యులం అంటూ కొందరు వ్యక్తులు ఇటీవల మహాటీవీ ఛానల్ కు వెళ్ళి డిబేట్ లో పాల్గొనిమరీ కౌశల్ పై వచ్చే విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టారు. కౌశల్ ను వారంతా దాదాపుగా దేవుడు అన్నట్లుగా, దైవాంశ సంభూతుడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ లోని మిగిలిన సభ్యులంతా దొంగలే అన్నట్లుగా మాట్లాడారు. వారు కౌశల్ కు నిజమైన అభిమానులేనా, లేకపోతే అతను ఈ షోలో ప్రవేశించటానికి ముందే ఏర్పాటుచేసుకున్న మనుషులా అనేది తెలియదుగానీ ఒక విషయాన్ని మాత్రం కాదనలేం. అతనికి ఫేక్ ఎకౌంట్లతో ఓట్లు పడటానికి అవకాశం ఉందనేది ఎంత నిజమో, అతనికి నిజమైన అభిమానులుకూడా కొందరు ఉన్నారనేది అంతే నిజం. దానికి కూడా ఒక కారణం ఉంది. షో ప్రారంభమైన మొదటి రోజుల్లో ఒకసారి కిరీటి అతని కళ్ళల్లో మూర్ఖంగా నిమ్మకాయ పిండటానికి ప్రయత్నించబోవటం అతనికి బాగా కలిసొచ్చింది. అతనికి ఏర్పడిన అభిమానమంతా ఈ ఒక్క సంఘటనవలనేనని చెబుతున్నారు. అతనిపై నాడు ఏర్పడిన సానుభూతే అభిమానంగా మారిందని అంటున్నారు. ఒక్కోసారి అండర్ డాగ్ ల పట్ల విపరీతమైన అభిమానం ఏర్పడటం సహజమే. కౌశల్ కు ఇలాగే ఏర్పడిన అభిమానం, తదనంతర కాలంలో బాగా పెరిగిపోయిందనేది ఒక వాదన.

 

అయితే ఆ అభిమానం మిగిలిన సభ్యులకంటే ఎన్నో ఎన్నో… వందల రెట్లుగా పెరగటానికి(ఓట్లరూపంలో) కారణమేమిటో తెలియటంలేదు. అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఫోకస్, విల్ పవర్, ఎలాగైనా గేమ్ గెలవాలన్న ధృడనిశ్చయం అతనిలోని మంచి లక్షణాలు. ఆ మాటకొస్తే హౌస్ లో ఇప్పుడున్న సభ్యులు ఐదుగురిలోనూ ఒక్కో మంచి క్వాలిటీ ఉంది. తనీష్ రిలేషన్స్ కు ఎంతో విలువ ఇస్తాడు. గీత ఎంతో మెచ్యూర్ గా, జీనియస్ లాగా ఆలోచిస్తుంది. సామ్రాట్ లో ఇన్నోసెన్స్ అందరికీ నచ్చుతుంది. దీప్తిలో బలమైన విజయకాంక్ష ఉంటుంది. మరి వీరందరికంటే కౌశల్ కు ఓట్లు ఎక్కువ రావటానికి కారణం ఏమిటా అని చూస్తే, అతనేమైనా అందగాడా అంటే – అతనికంటే సామ్రాట్, తనీష్ కూడా అందంగానే ఉంటారు. పోనీ మేచోగా, బలంగా ఉంటాడా అంటే – ఎప్పుడు చూసినా హౌస్ లో జిమ్ దగ్గర కసరత్తులు చేస్తూ కనిపిస్తాడుగానీ, అయ్యగారి మజిల్ పవర్ మొన్నటి ఇసక టాస్కుల దగ్గర బయటపడింది. సామ్రాట్ అవలీలగా కౌశల్ ను లాగి పక్కన పారేశాడు. దానితో రెండో రౌండులో అతని దరిదాపులకుకూడా వెళ్ళటానికి కూడా కౌశల్ భయపడ్డాడు. ఇక అదే టాస్క్ విషయంలో తనీష్ ను కూడా కౌశల్ ఏమీ చేయలేకపోయాడు. సరే, ఈ శారీరకబలం సంగతి వదిలేస్తే, అతనేమైనా ధీరోదాత్తంగా హిరాయిక్ గా ప్రవర్తిస్తాడా అంటే,అతని మనస్తత్వమంతా బాహుబలిలో భల్లాలదేవ టైపు. సెల్ఫిష్ నేచర్, కుళ్ళుమోతుతనం అతనిలో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడుతుంటాయి. ఎవరితోకూడా మనసువిప్పి మాట్లాడకపోవటంతో, ఎవరితోనూ బాండింగ్ లేకపోవటంతో హౌస్ లో అతనికి ఎవరితో మంచి సంబంధాలు లేవు. 

 

దానికి తోడు మొదటివారం నుంచి అతను అందరిమీదా కంప్లెయింట్లు ఇస్తుంటాడు. మొదటివారమే హౌస్ లో అందరూ దొంగలే అన్నట్లుగా మాట్లాడాడు. ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉంటాడు. చుట్టూ నెగెటివిటీని ప్రసరింపజేస్తుంటాడు. ఎవరూ కెప్టెన్ కాకుండా ఉండటంకోసం ప్రయత్నిస్తుంటాడు. కలర్ వాటర్ గ్లాస్ అనే టాస్క్ లో రోల్ రైడా గెలిచినాకూడా ఎవరూ గెలవలేదని మోడరేటర్ స్థానంలో ఉన్న కౌశల్ బిగ్ బాస్ కు చెప్పాడు. కోడిగుడ్ల టాస్క్ లో కూడా సామ్రాట్ ఫైనల్ కు చేరకుండా చేయటానికి శతవిధాలా ప్రయత్నించాడు. మగధీర విలన్ లాగా తనకు దక్కనిది ఎవరికీ దక్కగూడదనేది అతని ఫిలాసఫీ. అతనిలో ఇన్ని విలన్ లక్షణాలు ఉన్నాకూడా అతనికి ఓట్లు గణనీయంగా పడుతున్నాయంటే, లోకో భిన్న రుచి అన్నట్లు జనం టేస్టులు అలా ఉంటున్నాయని అనుకోవాల్సివస్తోంది. అయితే ఒకటిమాత్రం వాస్తవం. అతి కొద్ది కాలంలో… రెండు మూడు నెలల కాలంలోనే ఈ కౌశల్ అభిమానులు ఒకచోట చేరి(consolidate) ఇలా వ్యవస్థీకృతంగా ఈ ఓట్ల ప్రక్రియను నడిపించటం,విమర్శలను తిప్పికొట్టటం చూస్తుంటేమాత్రం అనుమానాలు రాక మానవు. ఎందుకంటే ఒక కొత్త హీరోకే అభిమానులు సంఘాలుగా, ఒక వ్యవస్థగా మారటానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. కౌశల్ కు ఇంత తక్కువకాలంలో ఇంతమంది అభిమానులు ఒకచోట కన్సాలిడేట్ అయ్యి ఇంత వ్యవస్థీకృతంగా క్యాంపెయిన్ నడుపుతున్నారనటమే అనుమానాలకు తావిస్తోంది. అతను రియాల్టీ షోలో సభ్యుడా, దేశాన్ని కాపాడటంకోసం ఒంటరిగా శత్రుసైన్యాలపై పోరాడుతున్న వీరజవానా అని మనకే సందేహం కలుగుతుంది. అతనికున్న అభిమానులు నిజమైనవాళ్ళే అయితేమాత్రం విలన్లను అభిమానంచే జనం పెరిగిపోయారని అనుకోవాల్సివస్తుంది.

 

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ షో ఓటింగులో మతలబు చేయటానికి ఇన్ని అవకాశాలు ఉందని స్పష్టంగా తెలుస్తున్నా, నిర్వాహకులు దానిపైన చర్యలు తీసుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా టెక్నాలజీ మేనిప్యులేషన్ కు అవకాశాలు ఉండే సందర్భాలలో ఐటీ సంస్థలు తమ algorithmsను తరచూ మారుస్తూ అక్రమాలను నివారిస్తుంటారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు అలాంటి చర్యలేమీ తీసుకోవటంలేదు. వారం వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఒక సభ్యుడి అభిమానులు నిర్దేశిస్తున్నారంటే ఆ షో క్రెడిబులిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఓటింగ్ వ్యవస్థను సరిదిద్దటానికి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినిట్లు వ్యవహరిస్తూ కేవలం డబ్బుచేసుకోవటమే లక్ష్యంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పైగా ఈ షో ప్రసారం చేసే సమయంలో ప్రసారం చేసే ప్రకటనల రూపంలో వచ్చేది చాలనట్లు, ఎన్నోరెట్లు దిగజారి, కార్పొరేట్ సంస్థలనుంచి డబ్బు తీసుకుని హౌస్ లో సభ్యులతో వివిధ వాణిజ్యఉత్పత్తులతో ఇంటర్నల్ గేమ్స్ ఆడించి ఆ సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పించటం చేస్తున్నారు. ఆ వాణిజ్య ఉత్పత్తుల ప్రచారం గేమ్స్ చూస్తుంటేనే టీవీ కట్టేయాలనిపిస్తూ ఉంటుంది.

 

ఏది ఏమైనా, బిగ్ బాస్ సీజన్ 2 లో ఫలితాన్ని నిజమైన ప్రజాదరణ ఆధారంగా కాకుండా ఫేక్ ఓటింగ్ ద్వారా నిర్ణయించటమే జరిగితే – తర్వాత కాలంలో వచ్చే సీజన్ 3 ని జనం ఛీదరించుకోవటంమాత్రం ఖాయం అనే విషయాన్ని నిర్వాహకులు గుర్తుంచుకోవాలి. తాజాగా దీప్తి నల్లమోతు కౌశల్ ను దాటిపోతుందనికూడా వార్తలు వస్తున్నాయి. ఇదికూడా సహజమైన ప్రజాభిప్రాయంగా అనిపించటంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఒకటి మాత్రం నిజం. హౌస్ లోని సభ్యుల పనితీరు ఆధారంగాకాకుండా, కేవలం ఒక సోషల్ మీడియా గ్రూప్ ఆధారంతోనో, టెక్నాలజీ లోని లొసుగుల ద్వారానో ఒక సభ్యుడు/సభ్యురాలు గెలవటం అనేది ఆ షోను పలచన చేస్తుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు గమనించాలి.

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరా బాద్)