‘విరాటపర్వం’ లాంచింగ్ రానా డుమ్మా, కారణం ఇదే!

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించబోతున్న సినిమా ఈ రోజు మొదలైంది. ఈ చిత్రానికి ‘విరాటపర్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సినిమా స్క్రిప్టును సురేశ్‌బాబు దర్శకుడికి అప్పగించారు. కాగా ఈ పూజా కార్యక్రమానికి రానా, సాయి పల్లవి హాజరు కాలేదు.

అయితే రానా ఈ కార్యక్రమంలో ఉంటారని అంతా భావించారు. అందుకు కారణం..ఆయన హాథీ మేరీ సాథీ చిత్రం షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షెడ్యూల్ గ్యాప్ లేకుండా షూటింగ్ జరగటంతో రానా ఈ లాంచింగ్ ముహూర్తానికి రాలేకపోయినట్లు సమాచారం.

‘విరాటపర్వం’ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ఎల్వీ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారట. 1992 నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిసింది.

నిజ జీవిత కథ ఆధారంగా పొలిటికల్‌ ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రేమలో విఫలమై, నక్సలైట్‌గా మారిన యువతిగా సాయిపల్లవి, రాజకీయ నాయకుడిగా రానా సందడి చేయనున్నట్లు చెబుతున్నారు.