ఓటీటీ రిలీజ్ కి మ‌రో రెండు క్రేజీ సినిమాలు రెడీ

                                 కీర్తి సురేష్ .. సాయి తేజ్ ..ఓటీటీకి సై అనేశారా?                           

టాలీవుడ్ నుండి మరో రెండు పెద్ద చిత్రాలు ఒటీటీలో విడుదలకు సిద్ధమ‌వుతున్నాయి. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన `మిస్ ఇండియా` డీల్ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని స‌మాచారం. మిస్ ఇండియా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే అధికారిక తేదీని చిత్ర‌బృందం ప్ర‌క‌టించాల్సి ఉంది. పెంగ్విన్ త‌ర్వాత‌ కీర్తి సురేష్ న‌టించిన‌ రెండవ చిత్రం ఓటీటీలో వ‌చ్చేస్తోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరో.

సుప్రీం హీరో సాయి తేజ్ – నభా నటేష్ జంట‌గా న‌టించిన `సోలో బ్ర‌తుకే సో బెటర్` ఓటీటీ డీల్ పూర్త‌యింద‌ని స‌మాచారం. సుబ్బు ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యాన‌ర్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం జీ5లో మే-1 న విడుదల కానుంది.

ఈ చిత్ర నిర్మాతలు డిజిటల్, శాటిలైట్ , థియేట్రికల్ హక్కులను జీ వాళ్ల‌కు భారీ ధరలకు అమ్మారు. నిజానికి థియేట్రిక‌ల్ రిలీజ్ కోస‌మే ఇన్నాళ్లు వేచి చూసినా.. ప్ర‌స్తుత స‌న్నివేశం దృష్ట్యా ఆలోచ‌న మారుతోంది. నాని – సుధీర్ బాబు మ‌ల్టీస్టార‌ర్ `వీ` డిజిట‌ల్ రిలీజ్ రైట్స్ విక్ర‌యించిన సంగ‌తి విధిత‌మే. ఆ త‌ర్వాత అనుష్క నిశ్శ‌బ్ధం కూడా ఓటీటీ లో రిలీజ్ కానుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కోన వెంక‌ట్ ఇప్ప‌టికే మంచి ధ‌ర కోసం వేచి చూస్తున్నార‌ట‌.