తెలంగాణ హీరో విజయ్ దేవరకొండ మంచి పని చేసిండు

ప్రముఖ కథానాయకుడు, తెలంగాణ సినీ హీరో విజయ్ దేవరకొండ మంచి పనిచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన 25 లక్షల విరాళం ఇచ్చారు.  విజయ్ దేవరకొండ శుక్రవారం మంత్రి కెటి రామారావు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు లభించిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ ఈ మేరకు శుక్రవారం 25 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని మంత్రి కేటీ రామారావు కోరారు. తన కుటుంబ సభ్యులతో మంత్రిని కలిసిన విజయ్ ఈమేరకు చెక్కును అందించారు.

తొలి ఫిలింఫేర్ అవార్డును వేలంవేసి ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన విజయ్ దేవరకొండను మంత్రి కేటిఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఒక మొక్కను అందించిన మంత్రి తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజయ్ ను కోరారు. దీంతోపాటు పురపాలక శాఖ తరఫున చేపట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం లోనూ పాల్గొని, ఈ అంశం పైన ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలోనే జలమండలి అధికారులతో ఒక కార్యక్రమం లో పాల్గొంటానని మంత్రికి విజయ్ దేవరకొండ హామీ ఇచ్చారు.

తాను ప్రారంభించిన రౌడీ క్లబ్ మొబైల్ అప్లికేషన్ వివరాలను ఈ సందర్భంగా మంత్రికి విజయ్ తెలిపారు. ఇందులో భాగంగా అమ్మకాలు జరుపుతున్న వస్త్రాల తయారీనే తెలంగాణలో చేపట్టాలని, ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు నగరానికి దగ్గరలో ఉన్న గుండ్లపోచంపల్లి అపరెల్ పార్కులో ఉన్న వస్త్ర తయారీదారులతో కలిసి పనిచేయాలని సూచించారు. మంత్రి సలహా మేరకు త్వరలోనే ఆయా వస్త్ర తయారీదారులతో సమావేశం అవుతానని విజయ్ దేవరకొండ తెలిపారు…