హ‌మ్మ‌య్య‌.. ఇప్ప‌టికి నిద్ర లేచిన సైరా టీమ్

బెంగ‌ళూరు ప్ర‌మోష‌న్స్‌కు డేట్ ఫిక్స్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.  అక్టోబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ఈ సినిమా రిలీజ్‌కు మ‌రో ఏడు రోజులే మిగిలింది. పాన్ ఇండియా చిత్రంగా మ‌ల‌చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పాపులారిటీని తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ ఈ సినిమా ప్ర‌చారాన్ని ఇంకా హోరెత్తించ‌డం లేద‌ని అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ నుంచి ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చి ఫ్యాన్స్‌కు ఆనందాన్ని క‌లిగిస్తోంది. పాన్ ఇండియా స్థాయి సినిమా కావ‌డంతో ఆ స్థాయిలో ప్ర‌చారం ఇప్ప‌టికే ప్రారంభించాల్సిన చిత్ర యూనిట్ ఆల‌స్యంగా అయినా మేలుకుని ఈ నెల 29 నుంచి బెంగ‌ళూరులో ప్ర‌చారం చేయ‌బోతోంది. తెలుగు సినిమాకు, చిరంజీవికి క‌ర్ణాట‌క‌లో మంచి మార్కెట్ వుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్ర‌చారాన్ని హోరెత్తించాల్సిందే. అందుకే చిత్ర బృందం అక్క‌డి నుంచి ప్ర‌చారం ప్రారంభించ‌బోతోంది. క‌న్న‌డ న‌టుడు సుదీప్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం కూడా ఈ సినిమాకు క‌ర్ణాట‌క‌లో క‌లిసొచ్చే అంశం దీన్ని ఆయూధంగా వాడుకుని క‌న్న‌డ‌లో క్రేజ్‌ని సొంతం చేసుకోవాల‌ని రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

`సైరా` టీమ్ వాట్ నెక్ట్స్‌?

బెంగ‌ళూరు త‌ర్వాత షెడ్యూల్ ఏమిటి? అన్న‌ది సైరా టీమ్ తేల్చాల్సి ఉంటుంది. దాదాపు 270 వంద కోట్ల భారీ వ్య‌యంతో నిర్మించిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తినెల‌కొంది. దీనికి తోడు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌డం ఈ చిత్రానికి ఉత్త‌రాదిలో మ‌రింత ప్ల‌స్‌గా మారే అవ‌కాశాలే అధికంగా క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ రోజే హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ క‌లిసి న‌టించిన `వార్‌` విడుద‌ల కాబోతోంది. అమితాబ్ కార‌ణంగా ఈ సినిమా ప్ర‌భావం `సైనా`పై ప‌డే అవ‌కాశం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నారు.