ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ వాయిదా

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఈ నెల 25(ఆదివారం)న ఆవిష్క‌రించేందుకు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ ఆవిష్క‌ర‌ణ కార‌ణాంత‌రాన వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్రభుత్వం నుండి అనుమ‌తులు ఇంకా మంజూరు కాలేదు. త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

వాస్త‌వానికి ఈ విగ్రహావిష్కరణ కోసం మెగాస్టార్ ప్రత్యేక విమానం లో బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుండి రోడ్ మార్గాన్న తాడేపల్లిగూడెం గం 10.15 ని. కు చేరుకుంటార‌ని తెలిసింది. కానీ ఆయ‌న ఈ ప్లాన్ ని ర‌ద్ధు చేసుకున్నారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ప్ర‌తియేటా ఎస్వీఆర్ విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ ఏడాది తాడేప‌ల్లి గూడెంలో ఆవిష్క‌రిస్తున్నారు. ప్ర‌తియేటా ఇలా ఏపీలో ఏదో ఒక ప్ర‌ధాన‌ న‌గ‌రంలో విగ్ర‌హావిష్క‌ర‌ణ ఉంటుంద‌న్న స‌మాచారం అందుతోంది.