మణిరత్నం పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండె పోటు రావటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఆరోగ్య పరిస్దితిపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దానికి తోడు మణిరత్నంకు గుండెపోటు రావడం మొదటి సారి కాకపోవటంతో అందరూ కంగారుపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే మణిరత్నంకు హార్ట్ స్ట్రోక్ రావటంలో నిజం లేదని ఆయన సతీమణి సుహాసిని కొట్టిపారేసారు.

సుహాసిని మాట్లాడుతూ..‘‘మ ఆయన సోమవారం ఉదయం పని చేయడానికి ఆఫీస్ కు వెళ్లారు. ‘నామ్‌ ఉమన్‌’ ట్రస్ట్‌ కోసం మా ఇంట్లో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశాను. ట్రస్ట్‌ కోచ్‌ రూపా రోటీలు, మామిడికాయ పచ్చడి తీసుకొస్తే, ఆయన ఇష్టంగా తిని, స్క్రిప్ట్‌లో మరింత స్పైస్‌ యాడ్‌ చేయడం కోసం ఆఫీస్‌కి వెళ్లారు’’ అని సుహాసినీ మణిరత్నం తెలిపారు.

ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే చారిత్రాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ రేంజ్‌లో స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించడానికి ఒకే చెప్పారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.