‘యాత్ర’:టీవీలో ఆపండంటూ ఫిర్యాదు

ఇది ఎన్నికలు టైమ్. ఏ పార్టికి ఆ పార్టీ తమదైన శైలిలో ప్రచారం చేసి గెలవాలని ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో ఎన్నికల కోడ్ ని చూపెట్టి ఆ ప్రచారాన్ని గండి కొట్టాలనే ప్రయత్నం మరో పార్టీ వారు చేస్తారు. ఇప్పుడు అదే ఆంధ్రలో జరగబోతోంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో భాగమైంది ఆయన పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను ఆ స్వయంగా చూశారు.. తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర నుంచి పుట్టినవే.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. అప్పట్లో ఈ పాదయాత్ర ఒక గొప్ప పరిపాలనకు నాంది. ఈ పాదయాత్ర అంశాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించారు.

ఆశ్రీత వేమగంటి విజయమ్మ పాత్రను పోషించారు. రావు రమేష్ కెవిపి పాత్రలో నటించారు. ఫిబ్ర‌వ‌రి 8, 2019న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా దాదాపు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2019 లో విడుదలైన హిట్ చిత్రాల సరసన చేరింది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 7న మాటీవీలో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ఆ ఛానెల్ తెలిపింది. ఏప్రిల్ 11న ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండగా, నాలుగు రోజుల ముందు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు.

మాజీ సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘యాత్ర’ సినిమాను పోలింగ్‌ తేదీకి 4 రోజుల ముందు బుల్లితెరపై ఓ టీవీ ఛానల్లో ప్రసారం చేయాలనుకోవటం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద పరిగణించాలని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 7నఈ సినిమా ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.