అఫీషియల్: హేమలతా లవణం పాత్రలో రేణూదేశాయ్‌!

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి మళ్లీ వివాహం చేసుకున్న రేణూ దేశాయ్‌ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. తాజాగా రెండు కొత్త ప్రాజెక్టులకు సైన్ చేశారు. ఈ విషయాన్ని రేణు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. ‘ఓ సినిమాకు సంతకం చేశానని మీకు చెప్పడం సంతోషంగా ఉంది. నేను చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నా.

వంశీ కృష్ణ (‘దొంగాట’ ఫేం) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సామాజిక వేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో నటించబోతున్నా. వ్యక్తిగతంగా నాకు ఆమెపై చాలా అభిమానం ఉంది. వెండితెరపై ఆమె పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నా. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే చెబుతా’.

‘ఇది కాకుండా మరో ముఖ్యమైన ప్రాజెక్టుకు కూడా సంతకం చేశా. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నా’ అని రేణు పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త లవణంతో కలిసి ‘సంస్కార్‌’ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు.

పూరీ జగన్నాథ్‌ ‘బద్రి’ సినిమాతో రేణు నటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత ‘జాని’ సినిమాలో నటించారు. ‘ఖుషి’, ‘జాని’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, ‘అన్నవరం’ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. 2014లో ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించారు. రేణు పలు సినిమాలకు ఎడిటర్‌గానూ పనిచేసిన సంగతి తెలిసిందే.