సినీనిర్మాత బండ్ల గ‌ణేష్ ప‌రారీ.. పోలీసుల వేట‌!

సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గణేష్‌.. అత‌డి అనుచ‌రుల‌పై పోలీస్ కేసు న‌మోదైంది. గ‌ణేష్ కొంద‌రు అనుచ‌రుల‌తో త‌న‌ని బెదిరించార‌ని నిర్మాత కం ఫైనాన్షియ‌ర్ ప‌ర‌మ్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది టెంప‌ర్ సినిమాకి సంబంధించిన వివాదం. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో పీవీపీ నుంచి తీసుకున్న 30కోట్ల ఫైనాన్స్ ని బండ్ల తిరిగి చెల్లించేసినా.. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ మాత్రం ఇవ్వ‌లేద‌ట‌. దానికి సంబంధించిన చెక్కులు పీవీపీ వ‌ద్ద ఉన్నాయి. త‌న అప్పు చెల్లించాల్సిందిగా కోరినందుకు బండ్ల అనుచ‌రులు త‌న‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని పీవీపీ ఆరోపించారు. 
 
గణేష్ స‌హా బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా గణేష్‌తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నార‌ని వెల్ల‌డైంది. ఆయన కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు చేపట్టారు.