సోషల్ మీడియాలో రూమర్స్ కు లోటేముంటుంది. ముఖ్యంగా వెబ్ మీడియా కూడా తన వ్యూస్ కోసం రకరకాల వార్తలను ప్రచారంలోకి తెస్తోంది. అయితే వాటివల్ల ఎవరికీ పెద్దగా నష్టం ఉండకపోవటంతో ఏ సమస్యా రావటం లేదు. అయితే కొన్ని సార్లు తెలియకుండా డామేజ్ ఇలాంటి వార్తలు వల్ల జరుగుతుంది. అలాంటిదే రామ్ చరణ్ తాజా చిత్రం విషయంలో జరిగింది. ఈ చిత్రంపై ఓ ప్రచారం మొదలైంది. దాని పర్యవసానం..తమ ప్రాజెక్టుపై బ్యాడ్ గా పడుతుందనే విషయం గమనించి..వెంటనే నివారణ చర్యలు అన్నట్లుగా ఖండన ప్రకటన చేసింది.
ఇంతకీ ఆ రూమర్ ఏమిటి..అనే విషయాల్లోకి వెళితే.. రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని… డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ చాలా కాలం క్రితమే ప్రకటించింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా ఈ ప్రభావం..రాజమౌళి తో చేస్తున్న సినిమా షూటింగ్ పై పడనుందని బోయపాటిని నిందిస్తూ స్టోరీలు వచ్చాయి. ఈ విషయం చిత్రం టీమ్ కు తెలిసినట్లుంది. వెంటనే దీనిపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. నవంబరు 10 నాటికి సినిమా మొత్తం టాకీ భాగం పూర్తవుతుందని తెలిపింది. కేవలం రెండు పాటల షూటింగ్ మిగిలి ఉంటుందని పేర్కొంది. నవంబరు తొమ్మిది నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని, త్వరలోనే ఫస్ట్లుక్ విడుదల కాబోతోందని సోషల్మీడియాలో పేర్కొంది.
ఇక ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడుగా చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఆర్యన్ రాజేష్, వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.