వైయస్ జగన్‌పై విరుచుకుపడ్డ నారా రోహిత్ !

హీరో నారా రోహిత్ వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన తండ్రి రామ్మూర్తి, పెదనాన్న చంద్రబాబుల గురించి వస్తునం వార్తలపై రోహిత్ స్పందించారు. సొంత బాబాయి మీదే చేయి చేసుకున్న చరిత్ర మీది. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు కుటుంబ బాంధవ్యాల గురించి ఏం తెలుసు. మా పెదనాన్న మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు అవాస్తవం. అయన మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు నారా రోహిత్. రామ్మూర్తినాయుడ్ని రాజకీయంగా ఎదగకుండా చేశారని.. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ పట్టించుకోలేదంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ.. ప్రెస్‌నోట్ విడుదల చేశారు రోహిత్.

ఈ లేఖలో నారా రోహిత్ ఏమన్నారంటే.. ‘నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న రామ్మూర్తినాయుడు మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొచ్చు.

నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. కనుకనే మేమంతా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లకండి. నాలుగు దశాబ్ధాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలకు, పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మరిచిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యం.

రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదే విధంగా చూసుకుంటున్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ? ప్రతి సంవత్సరం మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా గడుపుతున్నారు. మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితమయ్యారు’ అన్నారు నారా రోహిత్.