(సూర్యం)
రజనీతో సినిమా చెయ్యాలని ఎవరు ఉండదు చెప్పండి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ తెలుగు దర్శకుడుకి చిరంజీవితో సినిమా చెయ్యాలని ఉన్నట్లే, తమిళ దర్శకుడుకి రజనీని డైరక్ట్ చేయాలని ఉంటుంది. అయితే ఆ అవకాసం మాత్రం అతి కొద్ది మందిని మాత్రమే వరిస్తుంది. సాధారణంగా రజనీ వంటి సీనియర్ హీరోలు తమకు కంఫర్ట్ గా ఉండి గతంలో హిట్స్ ఇచ్చిన దర్శకులతో చేయటానికే ఇష్టపడతారు.
కొత్త దర్శకుడు అంటే ప్రయోగాలు వద్దులే అనుకుంటారు. అయితే రజని మాత్రం కొత్త నీరు రాకపోతే తను పాతబడి పోతానని గమనించారు. వరసగా ఈ తరం దర్శకులకు ఆఫర్స్ ఇస్తున్నారు. హిట్టో, ప్లాఫ్ తనను మాత్రం కాస్తంత కొత్తగా చూపెతారని ఆశ. ఇక అదే ఆలోచనతో మురగదాస్ చెప్పిన ఓ కథని సైతం రజనీ రీసెంట్ గా ఓకే చేసినట్లు తెలిసింది. మహేష్ గా రీసెంట్ గా స్పైడర్ అనే డిజాస్టర్ సినిమా ఇచ్చిన మురగదాస్ ఓ యాక్షన్ స్టోరీ తో రజనీని కలిసినట్లు సమాచారం.
ప్రస్తుతం రోబో 2 , ‘పేట్టా’ సినిమాతో బిజీగా వున్నారు సూపర్స్టార్ రజనీకాంత్. ఈ సినిమాల తర్వాత ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని తెలిసింది. ఈ విషయాన్ని మురగదాస్ ఇలా చెప్పారు. ”చాలా కాలం కిందటే స్క్రిప్ట్ను రజనీ సర్కు వినిపించా. ఆయనకూ నచ్చింది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఆయనకు నప్పేకథను సిద్ధం చేయడం నాకేమీ కష్టం కాదు. కేవలం ఒక నెలలోనే సిద్ధం చేస్తా. ఇప్పటికే ఓ కథ సిద్ధంగా ఉంది. మా ఇద్దరికీ డేట్స్ కుదిరితే కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తా” అని చెప్పారు మురగదాస్.
వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. అలాగే ఈ సినిమా తర్వాత రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలోనే రజనీ సినిమాలు మానేస్తారని.. అది మురగదాస్ సినిమా తర్వాత అని తమిళ సినివర్గాలు అంటున్నారు. అయితే అధికారికంగా ఏ సమాచారం లేదు.