బ్రేకింగ్ :మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష,జరిమానా

ప్రముఖ సినీ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. రూ.40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా, మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది.

కేసు వివరాల్లోకి వెలితే…

గతంలో వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50లక్షల చెక్కును మోహన్‌బాబు దర్శకుడికి అందించారు. అయితే, ఆ చెక్‌ నగదుగా మారకపోవడంతో వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు.