జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇలాంటి సున్నితమైన అంశాల్లో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికింది. దేశ భద్రతకు సంబంధిత వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
ఈ పిల్పై విచారణ చేస్తున్న సమయంలో పిటిషనర్ ఉద్దేశాన్ని ప్రశ్నించిన ధర్మాసనం, “ఇప్పుడు దేశం తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది. ప్రతి పౌరుడు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దిశగా నిలబడాలి. ఇటువంటి పిల్లు భద్రతా బలగాల మనోధైర్యాన్ని తగ్గించేలా మారకూడదు” అంటూ హెచ్చరించింది. దేశ పట్ల అందరికీ బాధ్యత ఉందని, కోర్టు వేదికను ఉపయోగించే ముందు తగినంత ఆలోచన అవసరమని సూచించింది.
దర్యాప్తు, భద్రతాపరమైన చర్యలు సంబంధిత అధికార యంత్రాంగం పరిధిలోకి వస్తాయని, వాటిపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. “న్యాయమూర్తులు ఈ రంగాల్లో నిపుణులు కాదు. దర్యాప్తు సంస్థలు తమ పని సమర్థంగా నిర్వహిస్తున్నాయి. వాటిపై నమ్మకం ఉంచాలి” అని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ మాత్రం తన వ్యాజ్యం విద్యార్థుల భద్రత కోసమే అని వివరించే ప్రయత్నం చేయగా, సుప్రీంకోర్టు స్పందిస్తూ “విద్యార్థుల భద్రతపై సమస్య ఉంటే సంబంధిత హైకోర్టులను ఆశ్రయించవచ్చు” అని సూచించింది. అనంతరం, పిటిషనర్ తన పిల్ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద, సుప్రీంకోర్టు ఈ అంశంపై ఘనమైన సందేశాన్ని ఇచ్చింది.. దేశ భద్రతపై పిలుపునిచ్చే ముందు జాగ్రత్త అవసరం.