‘మన నుంచే ఇది ప్రారంభం కావాలి.. నీ సోదరుడిగా ఎప్పుడూ గర్వపడుతూనే ఉన్నాను. గ్రామాన్ని దత్తత తీసుకోవడం నిజంగా ఓ గొప్ప పని. అవసరాల్లో ఉన్న ప్రజలకు మంచి చేయాలని తెలుపుతూ రామ్చరణ్కు స్ఫూర్తి కల్గించిన పవన్కల్యాణ్ గారికి ధన్యవాదాలు’ అని మంచు మనోజ్ రామ్ చరణ్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
‘తిత్లీ’ తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రామ్ చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తన బాబాయ్ పవన్కల్యాణ్ ఇచ్చిన సలహా మేరకు ఆనందంగా ఈ పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. చరణ్ను సోదరుడని సంబోధిస్తూ మెచ్చుకున్నారు.
ఆ ట్వీట్ కి మంచి స్పందన వస్తోంది. మెచ్చుకోవటం తో పాటు…ఓ గ్రామాన్ని మీరు కూడా దత్తత తీసుకోవచ్చు కదా..మీలాంటి మంచి మనస్సు ఉన్న మంచి మనుష్యులకే అది సాధ్యం అవుతుందంటూ పెద్ద ఎత్తున మనోజ్ ని నెట్ జనులు కోరుతున్నారు.
ఇక మంచు మనోజ్ గత ఏడాది ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేసారు. అయితే ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇదిలా ఉంటే ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ మనోజ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యారు. దీంతో మనోజ్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.