‘యాత్ర’: అవన్ని చూపొద్దని వైయస్ జగన్ చెప్పారు

వైఎస్‌ఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌తో మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మన ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ బయోపిక్‌ చేయాలనుకున్నప్పుడు విజయమ్మగారిని కానీ, వైఎస్‌ జగన్‌ ఏమన్నారనేది చెప్పుకొచ్చారు.

మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ….‘యాత్ర’ పోస్టర్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన తర్వాత పాదయాత్రలో జగన్‌ అన్నని కలిశాను. వైఎస్‌గారిపై సినిమా చేయాలనుకుంటున్నానంటే ఓకే అన్నారు. జగన్‌ అన్న ‘మా నాన్న చేయనివి చెప్పొద్దు. నాన్నగారు చేయనిదాని క్రెడిట్‌ మనకొద్దు’ అన్నారు. అంతేకాదు.. ‘నాన్నగారి గురించి జనాలకు మీరు ఓ కథ చెప్పాలనుకున్నారు. ఆ కథ ఏంటని నేను తెలుసుకుని, మార్పులు చేర్పులు చేయమని చెప్పడం కరెక్ట్‌ కాదు’ అన్నారు. ఆ మాట జగన్‌ అన్న చెప్పడం చాలా గ్రేట్‌ అని చెప్పుకొచ్చారు.