ఎలాంటి హ‌డావుడి లేకుండా నిఖిల్ పెళ్లి

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో లాక్ డౌన్ ల‌తో అట్టుడికిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఎంకి చావు సుబ్బికొచ్చిన చందంగా బ్ర‌హ్మ‌చారుల కొంప ముంచింది లాక్ డౌన్. ఎంతో ఘ‌నంగా పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లుగ‌న్న‌వారి ఆశ‌ల్ని అడియాస‌లు చేసింది. ఏదైతేనేం.. మొన్న దిల్ రాజు సింపుల్ వెడ్డింగ్ ప‌లువురికి స్ఫూర్తిగా నిలిచింది.

యంగ్ హీరో నిఖిల్ సైతం అదే బాట‌లో సింపుల్ గా పెళ్లి వేడుక‌ను కానిచ్చేశాడు. తాను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను నిరాడంబ‌రంగా పెళ్లాడేసాడు. ఈ పెళ్లికి కేవ‌లం 32 మంది అతిధులు మాత్ర‌మే ఎటెండయ్యారు. కుటుంబ స‌భ్యులు బంధుమిత్రుల్లో అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. 14 మే (గురువారం) ఉద‌యం 6 గంటల 31 నిమిషాలకు నిఖిల్ – ప‌ల్ల‌వి వ‌ర్మ జంట ఒక‌ట‌య్యారు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్ లో కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో భౌతిక దూరం పాటిస్తూనే వివాహ‌మాడారు. రెగ్యుల‌ర్ సెల‌బ్రిటీ వెడ్డింగ్ త‌ర‌హాలో కాకుండా ఎంతో సింపుల్ గానే వివాహం జ‌రిగింది.

ఇది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం. నిఖిల్ స్వ‌యంగా ప‌ల్ల‌వి వ‌ర్మ‌కు ప్ర‌పోజ్ చేయ‌గా తన నుంచి అంగీకారం లభించింది. ఫిబ్ర‌వ‌రిలో నిశ్చితార్థ‌మైంది. ఏప్రిల్ 14న జ‌ర‌గాల్సిన పెళ్లి క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు నిఖిల్ ఓ ఇంటివాడ‌య్యాడు. హ్యాపీడేస్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో నిఖిల్ కెరీర్ బెస్ట్ విజయాలు అందుకున్నాడు. ఇటీవ‌లే `అర్జున్ సుర‌వ‌రం` చిత్రంతో మ‌రో విజ‌యాన్ని అందుకున్న నిఖిల్ ప్ర‌స్తుతం కార్తికేయ సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. వ‌రుస‌గా ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. గీతా ఆర్ట్స్ లోనూ సుకుమారు శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో 18 పేజెస్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.