మెగాస్టార్ కోసం  ప్రభుత్వ  కార్యాలయం ! 

కూల్ అండ్ క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టకపోయినా సెట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉంది టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయం సెట్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గాక ఈ సెట్ లో నే మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారట. దాదాపు క్లైమాక్స్ మొత్తం ఈ సెట్ లోనే తీయబోతున్నారు.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం అలాగే యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ అవ్వడంతో సినిమాలో మెగాస్టార్ రోల్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. అయితే సినిమాలో కొంతభాగం మెగాస్టార్ కామెడీ చేయబోతున్నారట. మెగాస్టార్ కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ కొరటాల సినిమాలో తప్పకుండా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.