‘యాత్ర’ పై ‘సైరా’ డైరక్టర్ కామెంట్స్

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే సినిమాకు హిట్ టాక్ లభించింది. దాంతో వైయస్ అభిమానులు, చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఈ సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘ యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్‌ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్‌ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్‌ చేస్తున్నారు.