విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచం
హాలీవుడ్ కే పరిమితమైన నెట్ఫ్లిక్స్ ఇండియాను కూడా ఆవహించేసింది.అమెజాన్, హాట్ స్టార్, ఈరోస్ ఒకటేమిటి ఓటీటీ వేదికగా బోలెడన్ని చానెళ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి. ఇది సరికొత్త పోటీకి దారి తీయడమే గాక విస్త్రతంగా అవకాశాల వెల్లువకు దారి తీసింది. ఇప్పటికే బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్స్ సినిమాలు తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్ని డిజిటల్ మీడియా రంగం.. వెబ్ సిరీస్ లని ఎంచుకుని చేతినిండా పనితో బిజీ అయిపోయారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, మందిరా బేడీ వంటి వారంతా ఇప్పుడు వెబ్ సిరీస్లలో యమ బిజీ అయిపోయారు. తాజాగా తెలుగు, తమిళ భాషలకు చెందిన స్టార్స్ అంతా డిజిటల్ ప్రపంచంలోకి ఎంటరయ్యేందుకు రెడీ అవుతున్నారు.
తాజాగా డిజిటల్ బరిలోకి టాప్ బ్యూటీస్ కూడా వరుస కడుతుండటం ఆసక్తికరంగా మారింది. తొలుత క్రేజీ కథానాయిక సమంత త్వరలో ఓ వెబ్ సిరీస్లో నటించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇక కాజల్ అగర్వాల్ తొలిసారి వెబ్ దునియాలోకి ఎంటరవుతోంది. వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించబోతున్నాడు. చెన్నైలో ఈ శుక్రవారమే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఇప్పటికే జగపతిబాబు, అమల, లక్ష్మీ మంచు జీ5 నిర్మించిన వెబ్ సిరీస్లలో నటించారు. మరికొన్ని పైప్లైన్లో వున్నాయి. మెగా వారసురాలు నిహారిక, నాగబాబు కలిసి `నాన్న కూచి` పేరుతో ఓ వెబ్ సిరీస్లో నటించారు కూడా.
ఇక `బాహుబలి`తో పాపులర్ అయిన రమ్యకృష్ణ కూడా డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు వేస్తోంది. ఐరన్ లేడీ జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న వెబ్ సిరీస్లో ఆమె నటిస్తోంది. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా త్వరలో సెట్స్పైకి రాబోతున్న వెబ్ సిరీస్ ద్వారా విద్యాబాలన్ కూడా వెబ్ బాటపడుతోంది. ఇప్పటికే రాధికా ఆప్టే పలు వెబ్ సిరీస్లతో ఫేమస్ అయింది. వీరితో పాటు నిత్యామీనన్, ప్రియమణి, మౌనిరాయ్లు కూడా వెబ్ సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్రపంచం విస్తృతం కావడంతో సినిమాలు తగ్గించుకుని ఫేమస్ తారలంతా వెబ్ ప్రపంచం వైపు అడుగులు వేస్తుండటం కొత్త మార్పుకు శ్రీకారంగా కనిపిస్తోంది.
