మర్డర్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్,అంతా షాక్

తెలుగులో వస్తున్న ‘కోడలా కోడలా కొడుకు పెళ్లమా’ టీవి సీరియల్ లో నటిస్తున్న నటి దేవలీన ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. కిడ్నాప్‌నకు గురైన ఓ డైమండ్స్ మర్చంట్ మర్డర్ కేసులో టీవీ నటి దేవలీన భట్టాఛర్జీ ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర మంత్రి మాజీ సహాయకుడితోపాటు ఓ పోలీసు, మోడల్‌ను కూడా ఇది వరకే పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం రాజేశ్వర్‌ ఎడాని అనే వజ్రాల వ్యాపారి శవమై కనిపించాడు. ఘాట్కోపర్‌కు చెందిన రాజేశ్వర్‌ నవంబర్‌ 28 నుంచి కనిపించకుండాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, పది రోజుల అనంతరం వ్యాపారి మృతదేహం కుళ్లిన స్థితిలో రాయ్‌గఢ్‌లోని పన్వేల్‌ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. వ్యాపారి కాల్‌ డేటాను పరిశీలించారు.

సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలను ఈ వ్యాపారి తరచుగా కలిసేవాడని వారి దర్యాప్తులో తేలింది. మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వద్ద గతంలో పనిచేసిన సచిన్‌ పవార్‌ అనే వ్యక్తి.. టీవీ, సినిమా రంగాలకు చెందిన మహిళలను వ్యాపారికి పరిచయం చేసేవాడని తేల్చారు.

వెంటనే పోలీసులు సచిన్‌ పవార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసుతో సంబంధమున్న దినేశ్‌ పవార్‌ అనే సస్పెండెడ్‌ పోలీసు కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో టీవీ నటి దేవలీనాను కూడా పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుతో ఆమెకు ఎటువంటి సంబంధం ఉందన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ హత్య కేసులో ఇంకా సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు మహిళలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.