విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్‌`కు క‌రోనా ఎఫెక్ట్‌!

కొత్త త‌ర‌హా సినిమాల‌తో దూకుడు స్వ‌భావంతో ఇండ‌స్ట్రీలో గుర్తింపుని సొంతం చేసుకున్నాడు విశ్వ‌క్‌సేన్‌. ఇటీవ‌ల క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌` చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న విశ్వ‌క్‌సేన్ తాజాగా మ‌రో వెరైటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `పాగ‌ల్‌`. బెక్కెం వేణు గోపాల్ ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌రువారం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని రామానాయుడు సస్టేడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

హీరో విశ్వ‌క్‌సేన్‌పై హీరో రానా క్లాప్ నివ్వ‌గా స్క్రిప్ట్‌ని నిర్మాత దిల్ రాజు ద‌ర్శ‌కుడికి అందించారు. వెళ్లిపోమాకే, ఈ న‌గ‌రానికి ఏమైంది. ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్ చిత్రాల త‌రువాత విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న 5వ చిత్ర‌మిది. ఈ సినిమా ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ నెల 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు. క‌రోనా క‌నిక‌రిస్తేనే ఈ సినిమా షెడ్యూల్ 21 నుంచి మొద‌ల‌వుతుంది లేదంటే మ‌రో ప‌దిరోజులు వేచి చూడాల్సిన ప‌రిస్థితి.

ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి `గీత గోవిందం` ఫేమ్ మ‌ణికంద‌న్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.