మృతుల ఫ్యామిలీస్‌కి క‌మ‌ల్ భారీ విరాళం!

క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక‌స్మాత్తుగా క్రేన్ కూలి ముగ్గురు సిబ్బంది అక్క‌డి క‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ష‌న్ టీమ్‌లోని కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అస్టిస్టెంట్ మ‌ధు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చంద్ర‌న్ ఈ ప్ర‌మాదంలో మృతి చెందారు. బుధ‌వారం రాత్రి కీల‌క స‌న్నివేశాల్ని క‌మ‌ల్‌, కాజ‌ల్ పాల్గొన‌గా శంక‌ర్ చిత్రీక‌రిస్తున్నారు. దీని కోసం లొకేష‌న్‌లో క్రేన్ స‌హాయంతో లైట్‌ల‌ని ఏర్పాటు చేశారు.

అలా ఏర్పాటు చేసిన క్రేన్ ఉన్న‌ప‌లంగా కూలిపోవ‌డంతో ముగ్గుకు మృత్యువాత ప‌డ‌టంతో పాటు ప‌లువురికి తీవ్ర గాయాలైన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖులంతా స్పందించారు. అయితే ఈ దుర్ఘ‌ట‌న నుంచి తేరుకున్న క‌మ‌ల్‌హాస‌న్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు కోటి విరాళం ప్ర‌క‌టించారు. భ‌విష్య‌త్తులో వారి కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల‌కు గురికాకూడద‌నే తాను ఈ భారీ మొత్తాన్ని అంద‌జేయాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించ‌డం విశేషం.