మనిషి కరోనా కంటే ప్రమాదకరం అనడానికి ప్రూఫ్ లు ఎన్నో. ఇదిగో ఇది కూడా అలాంటిదే. తెలుగు, తమిళ్, మలయాళం సహా పలు భాషల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రియాజ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గజినీ సినిమాలో సూర్యని వెంటాడే సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో నటించి రియాజ్ ఖాన్ బాగా పాపులర్ అయ్యాడు. అటుపై చాలా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అయితే రియాజ్ ఖాన్ పై మానవ రూపంలో ఉన్న కరోనా దాడి చేసింది. తప్పు చేస్తున్నారు అని దండించినందుకు రియాజ్ ఖాన్ పై కొంత మంది మానవ మృగాలు దాడి చేయడం శోచనీయం. వివరాల్లో వెళితే…
రియాజ్ ఖాన్ చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో ఉన్న పన్నయార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఆరు బయట వ్యాయామం చేసుకుంటున్నాడు. అదే సమయంలో కొందరు గుంపులుగా అక్కడ ఒకరిపై ఒకరు పడి మాట్లాడుకుంటున్నారు. దీంతో రియాజ్ ఖాన్ దేశంలో పరిస్థితి బాగోలేదు. కరోనా వ్యాపిస్తున్న వేళ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ని ఎందుకు ఉపక్రమిస్తున్నారని హెచ్చరించే ప్రయత్నం చేసాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది గా కోరాడు. దీంతో కోపగించుకున్న ఆ మానవ మృగాలు రియాజ్ ఖాన్ పై ఉన్నపళంగా దాడికి దిగారు.
నీ పని నువ్వు చూస్తో? నువ్వు ఎవడివి మాకు చెప్పడానికి! కరోనా మాకు రాదంటూ పొగరుగా సమాధానం చెప్పారుట. దీంతో రియాస్ అంతే వైలెంట్ గా రియాక్ట్ అవ్వడం..ప్రతిగా వాళ్లు తిరిగి దాడి చేయడం జరిగిందిట. దీంతో రియాజ్ కు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. వెంటనే రియాజ్ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ మానవ మృగాలను పట్టుకునే పనిలో పడినట్లు సమాచారం. మంచికి పోతే చెడు ఎదురైందిట. కరోనా కల్లోలంలో ఇలాంటి సన్నివేశాలెన్నో చూస్తున్నవే. మేలు చేయాలనుకున్నా.. మనకు కీడు కలగకుండా అది ఎలా చేయాలో కూడా తెలిసి ఉండాలి సుమీ!