జ్వరంతో హాస్పటిల్ కు వెళితే..హీరోయిన్ కు లక్ష బిల్లేసారు!

హాస్పటిల్ వాళ్లు  దోచేసారంటూ వాపోయింది

`కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి` చిత్రం ద్వారా ఈ వారం తెలుగువారికి పరిచయం కాబోతున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. ఆమె తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. రీసెంట్ గా తనకు జ్వరం వస్తే.. తానో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లానని.. ట్రీట్మంట్ కోసం జాయిన్ కావాలని చెప్పారన్నారు. తర్వాతి రోజు నార్మల్ గా ఉండటంతో తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కోరితే.. ఆదివారం డిశ్చార్జ్ చేయటం సాధ్యం కాదని చెప్పేశారన్నారు.

కొన్ని పరీక్షలు జరిపిన వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు తన చేతికి రూ.లక్ష బిల్లు వేసినట్లుగా చెప్పారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేటప్పుడు జ్వరానికి అందరూ వాడే డోలా ట్యాబెట్లను చేతిలో పెట్టారని.. ఈ వ్యవహారం తనకు షాకింగ్ గా మారిందని వాపోయారు. ఈ వార్త ఓ సంచలనంగా చెన్నై వర్గాల్లో మారింది. ఒక సెలబ్రిటీ విషయంలోనే డాక్టర్లు ఇలా వ్యవహరిస్తే.. మిగిలిన వారి సంగతేమిటి? అంటున్నారు.

తెలుగులో ఆమె న‌టించిన తొలి స్ట్రెయిట్ చిత్రం `కౌస‌ల్యా కృష్ణమూర్తి` విడుద‌ల కానుంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో, వ‌ల్ల‌భ నిర్మించిన చిత్ర‌మిది. భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శకుడు. ఈ సినిమాను త‌మిళంలో శివ కార్తికేయ‌న్ `క‌నా` పేరుతో నిర్మించారు. `క‌నా` చిత్రానికి అఫిషియ‌ల్ రీమేక్‌గా `కౌస‌ల్యా కృష్ణమూర్తి`రూపొందించారు. ఈ చిత్రంలో ఆమె క్రికెట‌ర్‌గా న‌టించారు. త‌మిళంలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా ఇది.

తెలుగులోనూ పాజిటివ్ బ‌జ్ ఉంది. ఇప్పటికే పాట‌ల‌న్నీ హిట్ అయ్యాయి. మ‌రోవైపు ఐశ్వ‌ర్య రాజేష్‌కి ఈ నెల 23 త‌మిళ‌నాడులో కూడా చాలా స్పెష‌ల్‌. ఈ ఏడాది ఆమె న‌టించిన త‌మిళ సినిమా ఇప్పటిదాకా విడుద‌ల కాలేదు. ఈ నెల 23న తొలిసారి విడుద‌ల కానుంది. ఆ సినిమా పేరు `మెయ్‌`. అంటే నిజం అని అర్థం. ఆ చిత్రం మెడిక‌ల్ థ్రిల్లర్ అన్న‌మాట‌.