క‌రోనాతో `ఈరోజుల్లో` హీరో తండ్రి మృతి

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ ఈరోజుల్లో సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ తండ్రి మృతి చెందాడు. గ‌త 20 రోజులుగా విజ‌య‌వాడ‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పోందుతున్న వెంక‌ట‌దుర్గా రామ్ ప్ర‌సాద్ ఆరోగ్యం విష‌మించ‌డంతో నిన్న రాత్రి మృతి చెందిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న మృతితో కుమారుడు, న‌టుడు శ్రీ, అత‌ని కుటుంబ స‌భ్యులో విషాదంలో మునిగిపోయారు. తండ్రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక శ్రీ క‌న్నీరు మున్నీర‌వుతున్నాడు. కొవిడ్ మృతి కావ‌డంతో చివ‌రి చూపుకు కూడా నోచుకోని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆసుప‌త్రి నుంచి నేరుగా స్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించి ప్ర‌భుత్వ సిబ్బంది అధ్వ‌ర్యంలోనే అంత్య‌క్రియ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిచేస్తున్నారు. ఇక ఇటీవ‌లే ఈ త‌రం ఫిలింస్ అధినేత‌, నిర్మాత పోక‌రి రామారావు కూడా క‌రోనాతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రామారావుకి క‌రోనా సోకింద‌న్న విష‌యాన్ని ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్క‌కుండా కుటుంబ స‌భ్యులు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త కూడా ఒక రోజు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో క‌రోణా రోగుల వివ‌రాల‌ను అధికారులు ఎంత గోప్యంగా ఉంచుతున్నారో అర్ధ‌మ‌వుతోంది. తాజాగా మ‌రో న‌టుడి తండ్రి మ‌ర‌ణించ‌డంతో టాలీవుడ్ లో క‌రోనా డెత్ బెల్స్ మ్రోగిన‌ట్లు సెల‌బ్రిటీలు బెంబేలెత్తిపోతున్నారు.

కొవిడ్ భ‌యంతోనే ప్ర‌భుత్వం షూటింగ్ ల‌కు అనుమ‌తులిచ్చినా షూటింగ్ లు చేయ‌డం లేదు. హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. గ‌డ‌ప దాటి కాలు బ‌య‌ట పెట్ట‌డం లేదు. సాధార‌ణ రోజుల్లో ఖాళీ స‌మ‌యం దొరికితే విదేశాలు చుట్టే సే హీరోలంతా ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఇంటి త‌లుపు తీయాలంటేనే గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. అయితే అతి కొద్ది మంది హీరోలు మాత్రం ఆ మ‌ధ్య నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డం కోసం నిబంధ‌ల‌ను పాటిస్తూ బ‌య‌టకొచ్చారు.