అన్న‌పూర్ణ నుంచి మ‌రో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ?

స్టార్ హీరోల ద‌గ్గ‌రి నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ నుంచి సందీప్ కిష‌న్ వ‌ర‌కు ఇలా చాలా మంది హీలు సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌ని ప్రారంభించి అప్పుడప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి మ‌రో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోస్‌, ఎస్‌.ఎస్‌. క్రియేష‌న్స్‌, మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ వంటి నిర్మాణ సంస్థ‌లు వున్నా ఈ కాంపౌండ్ నుంచి మ‌రో నిర్మాణ సంస్థ‌ని యంగ్ హీరో నాగ‌చైత‌న్య ప్రారంభించ‌బోతున్నాడ‌ని తెలిసింది.

`మ‌జిలీ` చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన చైతూ కెరీర్‌ని జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ములతో `ల‌వ్‌స్టోరీ` చిత్రం చేస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌2న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో పాటు ప‌ర‌శురామ్‌తో ఓ చిత్రాన్ని చేస్తున్న నాగ‌చైత‌న్య ఓ యంగ్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆ చిత్రాన్ని తానే స్వ‌యంగా నిర్మించాల‌ను కుంటున్నాడ‌ట‌. ఇందు కోసం కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ని ప్రారంభించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో త‌ను హీరోగా న‌టించ‌డం లేద‌ని, రాజ్‌త‌రుణ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంద‌ని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.