అచ్చంపేట ఉద్రిక్తం, పోలీసుల లాఠీఛార్జీలో వ్యక్తి మృతి (వీడియో)

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన వ్యక్తి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామంలోని పోలింగ్ సెంటర్ వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. వారి గొడవను అదుపులో తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో నేనావత్ చంద్రు నాయక్ కూడా గాయపడ్డారు. అసలు వివరాలు ఏంటంటే…

అచ్చంపేట నియోజకవర్గంలోని ఆమ్రాబాద్ మండలం మున్ననూర్ పోలింగ్ సెంటర్ వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంచుతున్నారు. ఆ సమయంలో మాకే ఓటు వేయాలంటే మాకే ఓటు వేయాలని ఓటర్లకు సూచిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇరు వర్గాల కార్యకర్తలకు మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు వారి పై లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు. ఈ లాఠీ చార్జీలో పలువురికి గాయాలయ్యాయి.

 ఈ లాఠీ చార్జీలో గాయపడ్డ చంద్రు నాయక్ ఇంటికి వెళ్లి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో వాంతులు, ,విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు చంద్రు నాయక్ ను అచ్చంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రు నాయక్ శనివారం ఉదయం 10 గంటలకు మరణించాడు. అతని మరణ వార్త తెలుసుకున్న వివిధ ప్రాంతాల నాయకులు అతనికి సంతాపం తెలిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రు నాయక్

పోలీసులు దెబ్బల వల్లే చంద్రు నాయక్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రు నాయక్ ఏ పార్టీలో తిరిగే వాడు కాదని అతను ఓటు వేసేందుకు వస్తే ప్రాణాలు పోయాయని వారు రోదించారు. చంద్రునాయక్ వయస్సు 36 ఏళ్లు . అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చంద్రు నాయక్ మృతికి పోలీసులే కారణమని కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లమని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. చంద్రు నాయక్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం  అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల వీడియో కింద ఉంది చూడండి.