టిఆర్ఎస్ ఎంపి కవితకు మహిళల షాక్ (వీడియో)

ఆమె అసలే సిఎం కుమార్తె, పైగా నిజామాబాద్ ఎంపి.. అంతేకాదు తెలంగాణలో మాంచి పాలోయింగ్ ఉన్న నాయకురాలు. మరి ఆమె పలుకుబడి ఎట్లుంటదో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. 

కానీ ఆమెకు సొంత నియోజకవర్గంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. శుక్రవారం జరిగిన పోలింగ్ లో కవిత తన భర్తతోపాటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలో విఐపి కాబట్టి సరసరా లోపలికి వెళ్లిపోయి ఓటు వేసి వద్దామనుకున్నారు. ఆమె అలా వెళ్తున్నారో లేదో స్థానిక మహిళలు ఆమెను నిలువరించారు. ఢిల్లీకి రాజైనా ఓటుకు ఓటరే అన్నట్లు వారు లైన్ లో రావాలి అంటూ కేకలు వేశారు.

ప్రజాస్వామ్యంలో ఎక్కడ తేడాలున్నా ఓటింగ్ విషయంలో ఎవరైనా క్యూ లైన్ లో రావాల్సిందే. ఇదే విషయాన్ని స్థానిక మహిళా ఓటర్లు కవితకు గుర్తు చేశారు. దీంతో ఎంపి కవిత వెనక్కు వచ్చి మహిళా క్యూలైన్ లో నిలబడి వెళ్లి ఓటు వేసి అక్కడి నుంచి నిష్క్రమించారు.  (వీడియో సేకరణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి)