ఎన్నికల వేళ టిఆర్‌ఎస్ కి షాకిచ్చిన సీనియర్ నేత

మాజీ ఎంపీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రమేష్ రాథోడ్ టిఆర్ ఎస్ కు షాకిచ్చారు. రమేష్ రాథోడ్ టిఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. శుక్రవారం ఆజాద్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు.

టిఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రమేష్ అలకగా ఉన్నారు. ఖానాపూర్ టికెట్ ను ఆయన  ఆశించారు. కానీ దానిని రేఖా నాయక్ కు టిఆర్ ఎస్ అధిష్టానం కేటాయించింది. దీంతో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారని కార్యకర్తలు తెలిపారు.

తెదేపా పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్న రమేష్ రాథోడ్ ఏడాది కిందట ఖానపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఒప్పందంగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో టిఆర్ ఎస్ లో చేరారు. చివరి నిమిషంలో టిఆర్ ఎస్ టికెట్ రాకపోవడంతో ఖానాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటి చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన ఆయన శుక్రవారం గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేస్తానని వెల్లడించారు.

రమేష్ రాథోడ్

టిడిపిలో కీలకంగా ఉన్న రమేష్ రాథోడ్ ను రాజకీయంగా బలపడేందుకు టిఆర్ ఎస్ లో చేర్పించుకున్నారు.  గత కొంత కాలంగా అక్కడ ఉన్న తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, రాథోడ్ ల మద్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. రాథోడ్ పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం టిఆర్ ఎస్ అధిష్టానం ఖానాపూర్ టికెట్ ను రాధోడ్ కు కేటాయించకుండా మళ్లీ రేఖా నాయక్ కు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు.

అధి నాయకత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో స్వతంత్రంగా పోటి చేస్తానని ముందుగా రమేష్ రాథోడ్ ప్రకటించారు. కానీ తన క్యాడర్ తో చర్చించిన తర్వాత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్ కేటాయిస్తామని హామీ   ఇవ్వడంతో ఆయన శుక్రవారం ఆజాద్ సమక్షంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎన్నికల వేళ అసంతృప్త నేతలంతా జంప్ అవుతుండటంతో టిఆర్ ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుందని పలువురు నేతలు అన్నారు.