టిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేరేళ్ల శారద

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న మహిళలు తప్ప మరెవరూ బాగుపడకూడదా అని ఆమె ప్రశ్నించారు. ఉన్న మంత్రులలో ఏ మంత్రికి చీర కట్టి మహిళా మంత్రిగా చూపెడుతారని తీవ్రంగా విమర్శించారు.

నేరేళ్ల శారద ఇంకా ఏం అన్నారంటే…

“మహిళలకు మంత్రి పదవి ఇవ్వడం పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలి. జగదీష్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి. కవితకు బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. ఏ సమస్యల మీద ఆమె పోరాటం చేసిందని బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. వాళ్ల కుటుంబంలో ఉన్న మహిళలు తప్ప వేరే వారు రాజకీయంగా ఎదగకూడదని కేసీఆర్ ఆలోచన.

మహిళలు మంత్రులుగా పనికి రారా. ఉన్న మంత్రులలో ఏ మంత్రికి చీర కట్టి చూపిస్తారు. టిఆర్ఎస్ లో ఉన్న నలుగురు మహిళా ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు కూడా నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను అవమానపరిచారు. మహిళలు లేని మంత్రి వర్గం ఈ దేశంలోనే ఎక్కడా లేదు. 

మహిళ ,శిశు శాఖ మహిళా మంత్రికి ఇవ్వాలి. రానున్న ఎన్నికల్లో మహిళలు trs కు ఓట్ వేయకూడదని మహిళలు ఒట్టు పెట్టుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం యావత్తు తెలంగాణ మహిళలను అవమానిస్తోంది. విద్యార్ధినిల పై , యువతుల పై, మహిళల పై దాడులు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. ఈ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది.” అని నేరేళ్ల శారద విమర్శించారు.