డికె అరుణ మీద విరుచుకుపడ్డ జూపల్లి

మాజీ మంత్రి డికె అరుణ మీద నిప్పులు చెరిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. ఆయన ఏమన్నారో చదవండి.

నాకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టలేదు. మహబూబ్ నగర్ జిల్లా లో మూడు రోజులు పర్యటించిన కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పి కూడా 2014 లో కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు ఓడిపోయారు? నేను ఏ పార్టీలో ఉన్నా గెలిచాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కు చేస్తున్న ద్రోహం  అడ్డుకునేందుకే అప్పట్లో కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరాను. మహబూబ్ నగర్ అభివృద్ధి తెలంగాణ ఉద్యమ గొప్పతనమే.

అరుణకు రాజకీ భిక్ష పెట్టిందే నేను : జూప్లలి

డికే అరుణ కు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నన్ను అవినీతి పరుడినని అరుణ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు దారుణం. నాలుగు జన్మలెత్తినా నా పై అరుణ వేలెత్తి చూపలేరు. .అరుణ భర్త భరతసింహా రెడ్డి పై 25 /6 కేసు నమోదు కాలేదా ? దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయి. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నా ..అది కట్టేశాను కూడా. నేను పులి ని కాదు పిల్లి అన్నారు. అవును డీకే అరుణ కుటుంబం లాగా రక్త మాంసాలు రుచి మరిగిన పులిని మాత్రం కాదు.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మూడు గంటల్లో రాజీనామా చేస్తే డీకే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదు. తెలంగాణ ను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం లో డీకే అరుణ చివరి దాకా కొనసాగింది. ఏమి చూసి కాంగ్రెస్ కు ఓటెయ్యాలి ? అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెబుతున్నారు. యువత మీద కాంగ్రెస్ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోంది. ఎవరూ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు.

అరుణది సిగ్గు తప్బిన బతుకు

డీకే అరుణ ది ఆత్మవంచన, సిగ్గు తప్పిన బతుకు. పానగల్ జడ్పీటిసి గా డీకే అరుణ పోటీ చేయడానికి ఎవరు కారకులో చిన్నారెడ్డి , జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళను అడిగితే చెబుతారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ సభలు అట్టర్ ప్లాప్ షో లు గా మిగిలాయి. అవును ..స్వయం కృషి తోనే నేను క్లర్క్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాను. ఈ ఎన్నికల్లోనూ కొల్లాపూర్ నుంచి గెలుస్తా. గద్వాల లో ఏ చెట్టు ,పుట్ట నడిగినా డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. కెసిఆర్ ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ,టీడీపీ లు పొత్తు పెట్టుకుంటున్నాయి. కెసిఆర్ ఏ తప్పు చేశారని దించుతారు?

మహబూబ్ నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తో పొత్తు ను జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్దిస్తుండటం సిగ్గు చేటు. పదవి కోసం కాంగ్రెస్ నేతలు ఏ గడ్డి నైనా కరుస్తారు. ఈ సారి కాంగ్రెస్ 20 సీట్లు కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదు. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఎపుడో గోరీ కట్టారు .మరో నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ కు అధికారం కల్ల. రేపు పొరపాటున మహాకూటమి అధికారం లోకి వస్తే చంద్రబాబు కనుసన్నల్లో పాలమూరు ప్రాజెక్టు ల నిర్మాణం ఆగిపోతుంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ రెడ్డి లా తయారై టిఆర్ఎస్ కు 20 సీట్లు రావు అని చెబుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో పునరావృతం అవుతాయి. కాంగ్రెస్ కు బలం ఉంటే టీడీపీ తో పొత్తు ఎందుకు ? కచ్చితంగా టిఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది.