కేసిఆర్ ఫ్యామిలీకి నవాజ్ షరీఫ్ కు పట్టిన గతే : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ మీటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగానే సాగింది. వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు యూనిటీ చూపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు బాగానే ఐక్యతారాగం ఆలపించారు. సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు, ఆయన కూతురుకు పట్టిన గతే కేసిఆర్ ఫ్యామిలీకి పడుతుందన్నారు. కేసిఆర్ ను, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడును జైలకు పంపుతానని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో రికార్డులన్నీ తుడిపేస్తు నల్లగొండ పార్లమెంటు సీటును 5లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. అహంకారంతో మదమెక్కి కేసిఆర్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న కేసిఆర్ ను ఇక భరించే స్థితిలో జనాలు లేరన్నారు.

కేసిఆర్ మాటలు చూస్తుంటే ఎప్పుడు ఈ సర్కారును గద్దె దింపాల్నా అన్న కసి పెరుగుతున్నదన్నారు. నకిరేకల్ లో పది ఇరవై మంది జాయిన్ అయితే కేటిఆర్ ఏమేమో మాట్లాడుతున్నడని ఎద్దేవా చేశారు. కేటిఆర్ మాటలు చూస్తుంటే ఆయన ఏడ చదువుకున్నడో అమెరికాలో చదివిండా లేదా అర్థమైతలేదన్నారు. కనీస ఇంగితం లేకుండా కేటిఆర్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

మంత్రి జగదీష్ రెడ్డిపైనా కోమటిరెడ్డి వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి నల్లగొండ సభలో మాట్లాడిన ఫుల్ వీడియో పైన ఉంది చూడండి.