ప్రగతి భవన్, ప్రగతి నివేదన సభ పై కోదండరాం స్ట్రాంగ్ పంచ్

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్, తెలంగాణ ప్రభుత్వం జరపతలపెట్టిన ప్రగతి నివేదన సభ మీద తెలంగాణ జన సమితి పార్టీ అధినేత కోదండరాం తనదైన శైలిలో పంచ్ విసిరారు.  శుక్రవారం కోదండరాం మీడియాతో పలు ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. ఆయన మాటల్లోనే చదవండి.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 25,000 మంది విఆర్ఎ లు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేస్తున్నారు. వెంటనే వారిని విడుదల చేయాలి. ప్రగతి నివేదన సభ కోసం రింగ్ రోడ్డు ను మార్చుతున్నారు. కొంగర కలాన్ లో రైతులు తమ భూములు ఇవ్వము అని చెబుతున్నా  ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు వినడం లేదు.  అధికారులు అధికార దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన.

ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళిగా ఉన్నాయి. 13,000 మాత్రమే ఇప్పటి వరకు టిఎస్పిఎస్సీ  భర్తీ చేసింది. 10,000 పోస్టులను పోలీస్ శాఖ భర్తీ  చేసింది. మన అక్షరాస్యత 36 శాతం ఉంది. స్కూల్ కు వెళ్లని వారి శాతం 30 శాతం పైగా ఉన్నారు. 57 శాతం విద్యార్థులు ప్రయివేటు విద్యాలయాలో చదువుతున్నారు.  23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పాఠశాలలు ముసివేసారు.

4 ఏండ్లు పాలనలో కష్టాలు, కన్నీళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్రం నిరక్షరాస్యత లో నంబర్ వన్ గా ఉంది. అవినీతి లో నెంబర్ 2 గా ఉంది. దేశంలో సెక్రటేరియట్ రాని నెంబర్ వన్ సీఎం కేసీఆర్. దీన్ని గిన్నిస్ రికార్డ్ లో ఎక్కించాలి. మాకు ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనపడుతున్నది. ప్రగతి ఇంకా ప్రగతి భవన్ దాటి బయటకి రాలేదు.  కొండ లక్ష్మణ్ బాపూజీ , కేశవ్ రావు జాధవ్, గూడ అంజన్న కూడా గౌరవించుకోవాలి మనం. నందమూరి హారీకృష్ణను గౌరవించినట్టు మన తెలంగాణ ఉద్యమ కారులను కూడా గౌరవించాలి. 

రైతు ల ఆత్మహత్యలు 3వ స్థానం లో ఉన్నాము.  3,5000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  రైతు అప్పులలో 2 స్థానం లో ఉన్నాము. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సగానికి పైగా ఇప్పటికీ ఖర్చు కాలేదు. పెన్షన్ లు అందరికి ఇవ్వడం లేదు. ఉపాధి హామీ, పెన్షన్ లపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.

కాగ్ రిపోర్ట్  లెక్కల ప్రకారం మిషన్ కాకతీయ లో 18,606 చెరువులను తీసుకుంటే ఇప్పటికి 27 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిషన్ భగీరథ పనులు నత్త నడకన జరుగుతున్నాయ్. ప్రజలు ప్రభుత్వం తో మాట్లాడలేకపోతున్నారు. ధర్నా చౌక్ మూసివేశారు. ఒక కుటుంబం కోసం, ఒక కాంట్రాక్టర్ కోసం మాత్రమే పాలన సాగుతున్నది తప్ప ప్రజల కోసం కాదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతి మయం అయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు.
ప్రగతి నివేదన సభకు రమ్మని గ్రామాల్లో అడిగితే టిఆర్ఎస్ నేతలను నిలదీయండి. ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి. పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు అడగండి. నెరేళ్ళ లో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి ప్రజలారా. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి. 

జోనల్ వ్యవస్థ లో లోకల్ గుర్తింపు విషయం లో 1తరగతి నుంచి 10 వ తరగతి వరకు లోకల్ గా పరిగణించాలి. మినహాయింపుల విషయంలో ఆలోచన చేయాలి. రాజకీయ అవసరాలను బేరిజ్ వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తుంది. 

పార్టీ అభ్యర్థులను సమయానుకూలంగా మేము కూడా ప్రకటిస్తాం. పొత్తులపై ఇప్పుడే ఏమి చెప్పలేము. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12 న దీక్ష చేస్తాం.