విజయవాడలో కలకలం రేపుతున్న జనసేన ఫ్లెక్సీలు

విజయవాడ నగరంలో జనసేన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. టీడీపీని తీవ్రంగా విమర్శిస్తూ విజయవాడలో బుధవారం ఒక జనసేన ఫ్లెక్సీ వెలిసింది. టీడీపీ పై వారికి ఉన్న వ్యతిరేకతను ఈ విధంగా చాటుకుంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. “పిచ్చి ముదిరిన పచ్చ పురాణం, ఏం తమ్ముళ్లు వేధిస్తోందా ఓటమి భయం? గుర్తొస్తుంది దశాబ్ద ప్రతిపక్షకాలం? అంటూ ఫ్లెక్సీలో రాసి ఉంది. 2009 లో బెజవాడ గడ్డ మీద మీరు జీరో…2014 లో ఎలా అయ్యారో హీరో? అంటూ ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు.

మీ నాయకుడి తంత్రఫలమా? మా నాయకుడి కాలు మొక్కిన ఫలమా? అని తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఓటమి భయంతోనే కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. పచ్చ పేపర్లకి ఎక్కువ…సింగిల్ డిజిట్ కి తక్కువ. 2019 లో ఈ గతి పట్టించుకుంటే మేము జనసైనికులం కాదు. ఖబడ్ధార్ తెలుగు తమ్ముళ్లు…గోదావరిలో మీకు మొదలైంది కౌంట్ డౌన్. -మండలి రాజేష్, అమరావతి అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. దీనికి సంబంధించిన ఫోటో కింద ఉంది చూడండి.

అయితే జనసేన కార్యకర్తలు ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టడానికి ఇటీవలే టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో జనసేనను విమర్శిస్తూ పెట్టిన ఫ్లెక్సీ అని తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీలో “పవన్ కళ్యాణ్ గారూ నేను కూయందే తెల్ల‌వార‌దందంట‌…ఓ అమాయకపు కోడి, అలాగే ఉంది మీరన్నమాట…

మీరు మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు 2014 లోనే రిటైరయ్యేవారా? ఎందుకీ అహంకారపు ప్రగల్భాలు? మీ అన్నదమ్ములంతా కలిసి 2009 లో బరిలోకి దిగితే… మీకు వచ్చింది 18 సీట్లే. ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా… మీరు ఒకటో రెండు సీట్లు గెలిస్తే గొప్ప. మీకు అంతకుమించి సీనూ లేదు…సినిమా లేదు. 5 కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో…మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి, ఇది తధ్యం. -కాట్రగడ్డ బాబు. దీనికి సంబంధించిన ఫోటో కింద ఉంది చూడండి.

బెజవాడలో ఈ ఫ్లెక్సీల వార్ ఎక్కడివరకు వెళుతుందో అని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.