కొండా విశ్వేశ్వర్ రెడ్డికి టిఆర్ఎస్ సర్కార్ షాక్ (వీడియోలు)

బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ పై జిహెచ్ ఎంసీ అధికారులు కొరడా ఝల్లిపించారు. హస్పిటల్ నుండి రోడ్డు మీదకు నీళ్లు వదులుతున్నారని, దాంతో రోడ్లన్ని దెబ్బ తింటున్నాయని జిహెచ్ ఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండు సార్లు నోటిసులు జారీ చేసిన హస్పిటల్ యాజమాన్యం వైఖరి మార్పుకోలేదని అందుకే రూ. 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నామని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. 

 

హస్పిటల్ ముందు ఉన్న టిఫిన్ సెంటర్ ను కూడా పరిశీలించిన కమిషనర్ అక్కడ పరిశుభ్రత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్ ముందు అపరిశుభ్రంగా వ్యర్ధాలు వేశారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి టిఫిన్ సెంటర్ సీజ్ చేశారు. ఎప్పుడు లేనిది నేరుగా జీహెచ్ ఎంసీ కమీషనర్ రంగంలోకి దిగి అపోలో హస్పిటల్ పై రెండు లక్షల రూపాయల జరిమానా విధించండం చర్చనీయాంశమైంది.

జరిమానా విధింపు పై అనుమానాలు

అపోలో హస్పిటల్ ఎండీగా సంగీతా రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంగీతా రెడ్డి చేవేళ్ల  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటివల టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. టిఆర్ఎస్ పార్టీ పై పలు విమర్శలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని నాయకులంతా కేసీఆర్ చెప్పినట్టే నడుచుకోవాలని లేకుంటే అవమానాలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేశారు.  టిఆర్ఎస్ లో ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదని అందుకే బయటకొచ్చానని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల ముందు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డికి వల వేసినట్లు విమర్శలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ లోకి రావాలంటూ మర్రికి ఆఫర్ పెట్టినట్లు మర్రి ఆరోపించారు. ఆ తర్వాత ఎలాగూ టిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో సర్కారు ఏర్పాటు చేయగలిగింది. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీద సర్కారు నజర్ వేసిందన్న చర్చ మాత్రం ఉంది.

టిఆఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ రాజకీయాలలో మార్పులు రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. టిఆర్ఎస్ లో మొత్తం నియంత పాలన సాగుతుందని, కేసీఆర్ చెప్పిందే ఆట, పాడిందే పాటగా టిఆర్ ఎస్ రాజకీయాలు ఉన్నాయని ఆయన గతంలో ఆరోపించారు. టిఆర్ఎస్ లో ఎంపీలకు విలువ లేదని వారిని అసలు పట్టించుకోరని విశ్వేేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆసుపత్రి పై కావాలనే జరిమానా విధించారని రాజకీయ చర్చ జరుగుతోంది. పార్టీ వీడిపోయాడు కాబట్టి వారిని దెబ్బ కొట్టేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేరుగా కమీషనర్ రంగంలోకి దిగి జరిమానా విధించడం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  చిన్న చిన్న కారణాలు చూపించి అపోలో ఆసుపత్రి ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. నాలుగేళ్ల కాలంలో లేనిది ఇప్పుడే ఎందుకు జిహెచ్ఎంసి కమిషనర్ దాడులు చేశారని వారు నిలదీస్తున్నారు. 

అధికారులు తనిఖీ చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.