దళితుడి పై రెచ్చిపోయిన మహిళా సర్పంచ్.. వీడియో వైరల్!

దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా సమాజంలో దళితులకు సరైన గౌరవం లభించడం లేదు. పూర్వకాలంలో దళితులను చాలా నీచంగా చూసేవారు. అయితే ప్రస్తుత కాలంలో కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ దళితులను అట్టడుగు వర్గాలను చాలా నీచంగా చూస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో దళితులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలంగాణలోని ఒక గ్రామంలో మహిళా సర్పంచ్ ఒక దళిత వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం విషయంలో ఒక దళిత లబ్ధిదారుడు గ్రామ సర్పంచ్ కు లంచం ఇవ్వలేదని కోపంతో గ్రామ ప్రజలందరూ చూస్తుండగానే మహిళా సర్పంచ్ అతని మీద చెప్పుతో దాడి చేసిన ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

వివరాలలోకి వెళితే..నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బజకుంట గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తి తనకు లంచం ఇవ్వలేదనే కోపంతో మహిళ గ్రామ సర్పంచ్ సరితా రెడ్డి గ్రామస్తులు చూస్తుండగానే అందరి ముందు దళిత వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్రదుమారం రేపుతోంది. ఒక గ్రామానికి పెద్దగా వ్యవహరించాల్సిన మహిళా సర్పంచ్ ఇలా లంచం కోసం దారుణానికి పాల్పడటంతో అక్కడ ఉన్న ఒక గ్రామస్తులు ఈతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సదరు మహిళా సర్పంచ్ అధికారిక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావటంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారుతుంది.

అయితే దళితుల పట్ల నీచంగా ప్రవర్తించిన ఈ మహిళా సర్పంచ్ పై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో విపక్ష నేతలు విమర్శలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక అధికారి పార్టీకి సంబంధించిన నేత దళితులపై ఇలా దాడి చేయడం బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తప్పు పట్టారు. ఒకవైపు దళిత బంధు పేరుతో కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తుంటే అగ్రవర్ణాల నేతలు దళితులను అవమానిస్తూ వారిపై దాడులకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఈ వివాదం పై ఇప్పటివరకు స్పందించని సదరు ఎస్ఐ మీద చర్యలు తీసుకుని అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా మహిళా సర్పంచ్ సరితా రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.