‎Venu Swamy: మరోసారి వార్తల్లో నిలిచిన వేణు స్వామి.. ఈసారి ఏకంగా నీటిపై తేలియాడుతూ అలా!

‎Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఎక్కువగా రాజకీయ నాయకులు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామీ. గతంలో చాలా మంది సెలబ్రిటీల గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసి ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. అయినా కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అదే సమయంలో ఆయన చేసే పూజలు కూడా తరచూ వివాదాస్పదం అవుతున్నాయి.

‎సంతానం లేనివారు ప్రముఖ కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలి అనడం, కామాఖ్య ఆలయ అర్చకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే వేణు స్వామిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. తాజాగా మరోసారి తన పూజలతో వార్తల్లో నిలిచారు. వటుక భైరవ పేరుతో పూజలు చేసిన ఆయన స్వామి వారికి మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత వాటన్నింటినీ హోమంలో వేసి ఆహుతి ఇచ్చారు. కాగా ఈ వటుక భైరవ పూజ గురించి పలు ఆసక్తకర విషయాలు చెప్పారు వేణుస్వామి.

‎ఈ పూజ ఎవరి పేరు మీద అయితే చేస్తామో వారికి కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, డబ్బు పరంగానూ విజయం సిద్ధిస్తుందని అన్నారు. అలాగే శత్రువుల పీడ కూడా విరగడవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వటుక భైరవ పూజా కార్యక్రమంలో తప్పకుండా స్వామి వారికి తప్పకుండా మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించాలని వేణు స్వామి తెలిపారు. అయితే ఈ పూజా ఫలితం దక్కాలంటే పూజ చివరిలో నీటి మీద తేలియాడుతూ వటుక భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలని అన్నారు వేణు స్వామి. అందుకు తగ్గట్టుగానే పూజ అనంతరం ఫామ్ హౌస్ లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిపై తేలియాడుతూ వటుక భైరవ మంత్రాలను జపించారీ స్వామీజీ. ఇందుకు సంబంధించిన ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు వేణు స్వామి. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. హోమంలో మద్యం, మాంసం వేయడం పట్ల స్పందిస్తూ ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.