అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్‌… కవితకు షాకిచ్చిన ఈడీ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు పంపించింది. దీంతో ఈ విషయం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మొదటి నుంచి అనేక రకాల ట్విస్టులు, జలక్కులు, మధ్యమధ్యలో రాజకీయాలు కలగలిపి ఫుల్ సందడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయం కావడంతో పొలిటికల్ హీట్ పెంచింది.

అయితే… ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లై బుధవారమే అప్రూవర్‌ గా మారిన నేపథ్యంలో… శుక్రవారం విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం చర్చనీయాంశమ్మైంది. ఈ విషయంలో రామచంద్రపిళ్లై.. జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా, దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తుంది.

ఇలా అరుణ్పిళ్లై వాంగ్మూలం అనంతరం.. ఒక్కరోజు తర్వాతే విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. ఇక, ఈ ఏడాది మార్చి 11న ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ పై విచారణ కొనసాగుతున్న ఈ సమయంలో తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌ గా మారినట్లు తెలిసింది. ఫలితంగా కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని, దీంతో రేపు హస్తినకు బయలుదేరి వెళ్లాల్సి వస్తోందని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే… కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం తెలంగాణలో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్‌ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవూతున్న నేపథ్యంలో… అసెం‍బ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ విచారణకు పిలవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. మరి.. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.