ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయంగా కీలకంగా మారిన నాయకుడిగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకాలేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు విజయసాయికి ఈ నెల 18న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే, అప్పటికే తనకు ఇతర కార్యక్రమాలు ఉండడంతో 17న విచారణకు వస్తానని ఆయన ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై సిట్ అధికారులు సైతం ఒప్పుకున్నారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సిట్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత కూడా పెంచారు. మీడియా, అధికారుల దృష్టి మొత్తం అక్కడే కేంద్రీకృతమవగా… విజయసాయి మాత్రం మధ్యాహ్నం దాకా కూడా అక్కడికి రాలేదు. చివరికి తాను విచారణకు హాజరుకాలేనని, త్వరలోనే కొత్త తేదీని తెలుపుతానంటూ సమాచారం పంపారు. దీంతో విచారణ మరోసారి వాయిదా పడింది.
ఈ క్రమంలో కొన్ని వర్గాల్లో విజయసాయి ఉద్దేశపూర్వకంగా విచారణకు దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సీఐడీ విచారణకు హాజరైనప్పుడు విజయసాయి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. “ఈ వ్యవహారం అంతా కసిరెడ్డి కనుసన్నల్లో జరిగింది” అంటూ ఆయన అప్పట్లో చెప్పిన మాటలు అధికార వర్గాల్లో హల్చల్ రేపాయి.