ఒక రాష్ట్ర ప్రజలకు ప్రధాని ఇలా అబద్దాలు చెప్పవచ్చా!!!

million dislikes for man ki beat modi twitter account hacked

నవ్యాంధ్రప్రదేశ్‌ అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అడ్డంకిగా తయారయ్యారు. నాలుగున్నరేళ్లుగా ఐదుకోట్ల మంది ఆంధ్రులను ఆయన నయవంచనకు గురిచేశారు. వివక్ష చూపుతూ ఆంధ్రుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పట్ల మోడీ సర్కారు చూపుతున్న వివక్ష, కక్ష పూరిత వైఖరి సుప్రీం కోర్టు సాక్షిగా మరోమారు బట్టబయలైంది. హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ పార్లమెంటు ఉభయ సభలలో మాట్లాడుతూ.. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేసి తీరతామని చెప్పారు. అదే హోంశాఖ సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో విశాఖలో రైల్వే జోన్‌ సాధ్యం కాదని తేల్చి చెప్పడం దారుణం.

పైపెచ్చు పదో షెడ్యూలులో సంస్థలను విభజించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. పదో షెడ్యూలులోని ఉన్నత విద్యామండలిని ఆస్తులను, అప్పులను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాల మధ్య విభజించాలన్న సుప్రీం తీర్పును అమలు చేయకుండా మోడీ సర్కారు తెలంగాణ లోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కొమ్ము కాస్తోంది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముడిపడనీయకుండా అడ్డు పుల్లలు వేస్తోంది.

రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల విషయమై కోర్టుకు సైతం అవాస్తవాలను ఫైల్‌ చేసింది. పైపెచ్చు బాధ్యతలను విస్మరించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు గొడవపడుతున్నందునే విభజన చట్టం అమలు చేయడం సాధ్యం కాదని కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చింది. టిఆర్‌ఎస్‌ పార్టీతో లోపాయికారీ అవగాహనకొచ్చి ఆంధ్రప్రదేశ్‌పై ఉసిగొల్పుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భుజాలపై నుంచి ఆంధ్రులపై తుపాకీ ఎక్కుపెట్టింది.

విభజన చట్టం అమలు చేయకుండా మోడీ సర్కారు అవలంబిస్తున్న దుర్నీతికి సుప్రీంకోర్టుకు వరుసగా సమర్పిస్తున్న అఫిడవిట్‌లే ప్రబల నిదర్శనం. దీనిపై ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జీవిఎల్‌ నరసింహారావు సహా ఇతర నాయకులు ఐదుకోట్ల మంది ఆంధ్రులకు ఏం సమాధానం చెబుతారు? సిగ్గులేకుండా కొంతమంది ఆ పార్టీ నాయకులు రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పినందుకు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లారు? 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వలేదని, వీడియోలను మార్ఫింగ్‌ చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఆంధ్రప్రదేశ్‌ పౌరుడిగా కాకుండా మోడీ తరఫున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తల్లిని చంపి బిడ్డను తీశారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్న మోడీ వాగ్ధానాలకు ఆ తిరుపతి వేంకటేశ్వరస్వామే సాక్ష్యం. అలాంటిది అది కూడా బూటకమేనని కన్నా వాదించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం.

రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కేంద్రలోని మోడీ సర్కారు పతనమై మళ్లీ కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడటం , ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన చట్టం అమలు చేయడం ఖాయం. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనీయకుండా ఐదుకోట్ల మంది ఆంధ్రులు ఆ పార్టీకి షాక్‌ ఇవ్వడం తథ్యం. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోవడం తథ్యం. 

-కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి,