టిఆర్ఎస్ ని గజగజ ఒణికిస్తున్న కాంగ్రెస్ డికె.శివకుమార్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. టిఆర్ఎస్, ప్రజా కూటమి నేతలు మెజార్టీ సీట్లు వస్తాయని ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ ఫలితాల ముంగిట అన్ని పార్టీలు రూట్ మార్చాయి.మెజార్టీ సీట్లు వస్తాయనుకున్న పార్టీలకు హంగ్ ఏర్పడుతుందేమోనన్న భయం పట్టుకుంది. వెంటనే అప్రమత్తమయిన నేతలు ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు.

కేసీఆర్ ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీతో సమావేశమయ్యి చర్చించారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయ్యింది. కాంగ్రెఃస్ కీలక నేతలను హైదరాబాద్ కు పంపుతోంది. అయితే కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి డికె శివకుమార్ ను కూడా కాంగ్రెస్ హైకమాండ్   ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు. ఇప్పుడా డికె శివకుమార్ టిఆర్ఎస్ ను ఒణికిస్తున్నారు. కర్ణాటక ట్రబుల్ షూటర్ గా డికె శివకుమార్ కు పేరుంది. కర్ణాటక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచిన  బిజెపి అధికారంలోకి రాకుండా కీ రోల్ పోషించి కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటయ్యేలా చేయడంలో డికె శివకుమార్ ప్రధాన పాత్ర పోషించారు. 

డికె. శివకుమార్

తెలంగాణలో కూడా సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందనే సమాచారంతో నేతలంతా అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాజకీయాలలో కూడా తన చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు ఆయన ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. డికె శివకుమార్ పేరు వింటేనే టిఆర్ ఎస్ నేతలకు భయం మొదలైతుంది. టిఆర్ఎస్ నేతలను అంతలా భయపెడుతున్న కాంగ్రెస్ నేత శివకుమార్ ఎవరు… అసలు ఏంటి  ఆయన ప్రత్యేకత..  ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

డికె. శివకుమార్… అసలు పేరు దొడ్డలపల్లి కెంపెగౌడ శివకుమార్.. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు. సిద్దరామయ్య కేభినేట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కుమార స్వామి కేభినేట్ లో జలవనరుల శాఖ మంత్రిగా, వైద్య విద్య శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. 2001లో మహారాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడినప్పుడు అక్కడి ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించి వారితో చర్చించి ప్రభుత్వం నిలబడేటట్టుగా చేశారు. 2017 లో రాజ్యసభ ఎన్నికల్లో ఒంటి చేత్తో చక్రం తిప్పి బిజెపి నేతలకు చుక్కలు చూపించారు. 

రాహుల్ తో శివకుమార్

రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ బరిలో నిలిచారు. బిజెపికి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండడంతో అహ్మద్ పటేల్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అప్పుడే సీన్ లోకి డికె శివకుమార్ ఎంటర్ అయ్యారు. గుజరాత్ కు చెందిన 42 మంది ఎమ్మెల్యేలను బెంగుళూరులోని తన రిసార్ట్ కు తరలించారు. వారితో క్యాంపు నిర్వహించి నేరుగా వారిని రాజ్యసభ ఓటింగ్ కు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అప్పుడే శివకుమార్ చతురతను చూసి సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ఆశ్యర్య పోయారు.

ఆ తర్వాత కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్ కు 5 సీట్ల తేడాతో వెనుకబడి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 70 కి పైగా స్థానాలు గెలిచింది. జెడిఎస్ 42 స్థానాలు గెలుచుకుంది. ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే శివకుమార్ ను సంప్రదించగా శివకుమార్ జెడిఎస్ నేతలతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో జెడిఎస్ కు సీఎం పదవి ఇచ్చి మంత్రి పదవుల పై కూడా ఓ క్లారిటి ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా చూశారు. కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ రేపిన ప్రభుత్వ ఏర్పాటులో డికె. శివకుమార్ చూపిన చొరవతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ముగ్దులయ్యారు. శివకుమార్ పై మరింత నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక బాధ్యతలు అప్పగించింది.

తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రకటన నాటి నుంచి కూడా శివకుమార్ ఎప్పటికప్పుడు తెలంగాణ పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. శివకుమార్ ఆర్దికమంతుడు. తెలంగాణలో కూడా పలువురు నేతలకు ఆయన ఎన్నికలలో ఆర్ధికంగా సహకరించారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రాబోతున్నాయి. హంగ్ రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ ను రంగంలోకి దింపింది. ఆయన ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. గెలుస్తారని నమ్మకం ఉన్న ముగ్గురు ఇండిపెండెట్లను ఇప్పటకే బెంగుళూరులోని క్యాంపుకు తరలించినట్టు తెలుస్తోంది.

ప్రతి నిమిషం నిమిషం మారే పరిణామాలపై వెంటనే నిర్ణయం తీసుకునే కర్త కర్మ క్రియగా పోషించే బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ శివకుమార్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. మరికొంత మంది కీలక నేతలు కూడా హైదరాబాద్ రాబోతున్నారు. శివకు మార్ ఎటువంటి అస్త్రం సంధిస్తాడోనని టిఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఆయన చేపట్టిన ఆపరేషన్లన్ని సక్పెస్ కావడంతో తెలంగాణలో కూడా ఆయన మరో విజయాన్ని నమోదు చేస్తారేమోనని టిఆర్ఎస్ నాయకులు భావిస్తన్నారు. డికె శివకుమార్ అస్త్రం తెలంగాణలో ఫలిస్తుందో లేదో చూడాలి మరీ.

డికె శివకుమార్ పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2013 ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ 251 కోట్ల రూపాయలుగా చూపించాడు. 2018 ఎన్నికల్లో 700 కోట్లుగా చూపించాడు. 5 ఏళ్లలోనే అతని సంపద ట్రిపుల్ పెరిగింది. అతని పై పన్ను ఎగవేత ఆరోపణల పై ఐటి 2017 లో దాడులు నిర్వహించింది. వీటిని రాజకీయ కుట్రగా నేతలు కొట్టిపారేశారు. ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి తెలంగాణలో ఆయన ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలుతుంది. టిఆర్ఎస్ నేతలకు మాత్రం శివకుమార్ టెన్షన్ తగ్గటం లేదు.