తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సారి యాగానికి సిద్దమవుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం నిర్వహించనున్నారు. జనవరి 21నుంచి జనవరి 25 వరకు ఈ యాగాన్ని చేయనున్నారు. మూడు సంవత్సరాల క్రితం 2015 లో సీఎం కేసీఆర్ ఇక్కడే చండీయాగం నిర్వహించారు. గత సంవత్సరం ఎన్నికలకు పోయే ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ యాగబలం పని చేసినందునే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా అజేయంగా తాను నిలిచానని ముఖ్యమంత్రి నమ్ముతున్నారని,అ ందువల్ల గతంలో తాను తలపెట్టిన అన్ని ప్రాజక్టులు, పధకాలు నిర్వఘ్నంగా పూర్తయ్యేందుకు ఈ సారి యాగం నిర్వహిస్తున్నట్లు టిఆర్ ఎస్ నాయలడొకరు తెలుగు రాజ్యం కు చెప్పారు.
ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఇప్పటికే యాగం పనులు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. ఇప్పటికే వేదపండితులకు మరియు రుత్వికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. శృంగేరీ పీఠ పండితులు శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యలో యాగ నిర్వహణ ఏర్పాట్ల పై సీఎం కేసీఆర్ చర్చించారు. యాగానికి సంబంధించి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్ధ, విశాఖ పీఠాధిపతి శారదా స్వరూపానదేంద్ర స్వామి ఆశీస్సులు, సలహాలు కేసీఆర్ తీసుకున్నారు. ఈ యాగానికి సందర్శకులను అనుమతించాలా వద్దా అనే దాని పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పలువురు ప్రముఖులు యాగంలో పాల్గొననున్నారు.
