డిఎస్ కొడుకు అర్వింద్ అంటే అమిత్ షా కు ఎందుకంత క్రేజ్ ?

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయనే కాదు బిజెపిలో ఉన్న ఆయన కొడుకు ధర్మపురి అర్వింద్ కూడా హాటే. ఈ పరిస్థితుల్లో డిఎస్ కానీ, డిఎస్ కొడుకు అర్వింద్ కానీ ఏ స్టెప్ వేసినా జనాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నది. తాజాగా డిఎస్ కొడుకు అర్వింద్ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేశారు. బిజెపి అధినేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో అమిత్ షా తో ప్రత్యేకంగా 15 నిమిషాలు కేటాయించి మాట్లాడారు. దీంతో అర్వింద్ మీద పార్టీలో, బయటా చర్చోప చర్చలు సాగుతున్నాయి.

మొనటికి మొన్న డి శ్రీనివాస్ ను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలంటూ కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కంకణం కట్టుకున్నారు. డిఎస్ ను బదనాం చేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లను కూడగట్టి వారిచేత సిఎం కేసిఆర్ కు లేఖ రాయించారు. బిజెపిలో ఉన్న తన కొడుకు అర్వింద్ ను ప్రమోట్ చేసేందుకు డిఎస్ ప్రయత్నాలు చేస్తూ టిఆర్ఎస్ కు నష్టం కలిగిస్తున్నారని కవిత నేతృత్వంలోని బృందం రాసిన లేఖ సారాంశం. అయితే ఈ విషయమై డిఎస్ మీద వేటు ఖాయమని అందరూ భావించారు. కానీ కేసిఆర్ ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు. డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చినా కేసిఆర్ సాహసం చేయలేదు. అయితే డిఎస్ కూడా కొద్దిగా తగ్గినట్లు కనబడుతున్నారు. కానీ కవిత మాత్రం వేటు వేయించేంతవరకు వదిలేలా లేదన్న చర్చ ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎంపి కవిత భర్త అనీల్ రావును రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో కవిత ఉన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. కవిత మాత్రం జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ నుంచి ఎంపిగా పోటీ చేసేందుకు డిఎస్ కొడుకు అర్వింద్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో విసృతంగా పర్యటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు డిఎస్ కొడుకు వర్సెస్ ఎంపి కవిత వైరంగా మారనున్నాయన్న టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఇటు డిఎస్ ను, అటు డిఎస్ కొడుకును టార్గెట్ చేసి కవిత ముందుకు సాగుతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది.

అయితే డిఎస్ కొడుకు అర్వింద్ బిజెపిలో దూసుకుపోతున్నారు. ఆయన వర్కింగ్ స్టయిల్, ఆహర్యం అంతా కరుడుగట్టిన సంఘ్ కార్యకర్తగా కనబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా తెలంగాణ బిజెపికి అర్వింద్ పెద్దదిక్కుగా మారొచ్చన్న ఉద్దేశంతో బిజెపి హైకమాండ్ ఉన్నట్లు కనబడుతున్నది. అందుకే శుక్రవారం అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా అర్వింద్ తో ప్రత్యేకంగా 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. నిజామాబాద్ లోక్ సభలో పార్టీ పరిస్థితిపై అర్వింద్ ను అడిగి తెలుసుకున్నారు. అర్వింద్ తండ్రి డిఎస్ మీద కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టిఆర్ఎస్ నుంచి నిజామాబాద్ లో కవిత పోటీ చేసినా, ఆమె భర్త అనీల్ రావు పోటీ చేసినా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలో బిజెపికి చాలామంది నేతలు ఉన్నారు. కొందరు సీనియర్లు కాగా మరికొందరు యూత్ లీడర్లు కూడా ఉన్నారు. కానీ అమిత్ షా మాత్రం కేవలం తెలంగాణలోని ఇద్దరే ఇద్దరు నేతలను ప్రత్యేకంగా కలుసుకుని వారితో చర్చలు జరిపారు. అందులో ఒకరు అర్వింద్ కాగా మరొకరు మహరాజ్ గంజ్ ఎమ్మెల్యే రాజాసింగ్.

పరిస్థితులు చూస్తుంటే పాత తరం బిజెపి నేతల మీద హోప్స్ పెట్టుకునే కంటే యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్న లీడర్లను నమ్ముకోవడమే బెటర్ అన్న భావనలో బిజెపి హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద లీడర్లను, చిన్న లీడరర్లకు కూడా దక్కని అవకాశం అర్వింద్ అండ్ రాజాసింగ్ కు దక్కిందని చెబుతున్నారు. భవిష్యత్తు బిజెపికి వీరిద్దరూ తుర్పు ముక్కలుగా మారనున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.