గడచిన సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కె చంద్రశేఖర రావు తన పార్టీ శాసనసభ్యులు మీద ప్రజల్లో ఎంతో అసమ్మతి ఉన్నప్పటికీ మెజారిటీ సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థులను మార్చకుండా సిట్టింగ్లకే కేటాయించారు. ఆనాడు అన్ని మీడియా సంస్థలు ఇది కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటని ప్రచారం చేశాయి. కెసిఆర్ ఓడిపోతే ఇది ఒక ప్రధానమైన కారణం అని కూడా తేల్చేశాయి.
అలాగే కెసిఆర్ నాలుగున్నర సంవత్సరాలలో ఏం చేశారో తెలియదుగానీ చివరి ఆరు మాసాలలో రైతుబంధు అనే పథకం కింద ప్రతి రైతు అకౌంట్లో 12 వేల రూపాయలు జమ చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం అందరూ ఈ పన్నెండు వేలు ఫలితాలని తారుమారు చేసిందని ప్రతిపక్షాలు విశ్లేషకులు అన్నారు. ఎంతో రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి దీనంతటికీ కారణం రైతుబంధు అని అందరూ నమ్మారు.
నాలుగు నెలల తర్వాత జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ రెండు అంశాలే తనని గెలిపిస్తాయని చంద్రబాబు చాలా గట్టిగా నమ్మారు అనుసరించారు కూడా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు మీద ఎంత సంతృప్తి ఉన్నా చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా సిట్టింగ్లకే అధిక ప్రాధాన్యత కల్పించారు. అలాగే ఎన్నికలకు మూడు నెలలు ముందర పసుపు కుంకుమని రైతుబంధు అని రెండు పథకాలు జనంలోకి వదిలి తను గెలిచేస్తున్నట్టు మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు.
ఫలితాలు విషయానికి వచ్చేసరికి తెలంగాణలో జరిగిన దానికి పూర్తి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో లో ఫలితాలు వెలువడినాయి. అధికారపక్షానికి తీవ్ర పరాభవం ఎదురైంది. ఫలితాలను విశ్లేషించుకున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ అంశాలైతే విజయానికి కారణం అయ్యాయో ఇక్కడ అవే అంశాలు ఓటమికి కారణం అయ్యాయి అని చంద్రశేఖర రావు పథకాలను నమ్మి మనము మోసపోయామని తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
