క్రికెటర్ శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం కోర్టు

కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవిత కాల నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. గతంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ మూడు నెలల్లోగా పున:సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది.

మరోవైపు ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రాక్టీస్ ను తాను ఇప్పటికే ప్రారంభించాననీ, త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

90 రోజులు పూర్తయ్యేవరకూ ఆగకుండా ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకోసం తాను ఆరేళ్లు ఆగాననీ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్ తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.