IPL 2020: అందరూ ఆమెను బాగా మిస్సవుతున్నారు.. ఆమె ఉంటే ఆ హుషారే వేరు

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 13 ప్రారంభమై రెండు వారాలు కావస్తుంది. అన్ని జట్లు రెండు మూడేసి మ్యాచ్‌లు ఆడటం.. స్టార్లు, అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు రఫ్పాడిస్తుండటంతో క్రికెట్‌ అభిమానులనుకు కావాల్సిన టీ20 విందు ఐపీఎల్‌ అభిమానులకు లభిస్తోంది. అయితే ఆటగాళ్లు దుబాయ్‌లో అదరగొడుతున్నప్పటికీ ఎక్కడో ఏదో మిస్సవుతున్నామనే భావన అందరిలోనూ కలుగుతోంది. ఆ మిస్సైన భావన ఏంటో కాదు మయాంతి లాంగర్‌. అందం, అభినయం, వాక్చాతుర్యం, విశ్లేషణలతో తనకంటూ ప్రత్యేకంగా క్రికెట్‌ అభిమానులను సొంతం చేసుకున్న మయాంతి లాంగర్ ఈసారి ఐపీఎల్‌లో ఎక్కడా కనిపించడంలేదు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు, మధ్యలో, ఆఖర్లో తన యాంకరింగ్‌, విశ్లేషణతో బోల్డెంత క్రేజ్‌ సాధించిన ఈ అమ్మడు ఎక్కడా కనిపించడం లేదు కారణమేంటి అనేదానిపై ఫ్యాన్స్‌ తెగ ఆసక్తికనబరుస్తున్నారు.

మయాంతి లాంగర్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డ ఆలనాపాలన చూసుకోవడంలో బిజీగా ఉండటంతో ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్ ఛానెల్‌ వారికి తెగేసి చెప్పేసిందంట. దీంతో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-2020లో మయాంతి ఎక్కడా కనిపించడంలేదు. ఇక ఈ రోజు తన బిడ్డను ఎత్తుకొని దిగి ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘అమ్మతనంలోని నిజమైన ఆనందం’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక మయాంతి ఫోటోకు అభిమానుల నుంచే కాకుండా సెలబ్రెటీల నుంచి కామెంట్స్‌ వస్తున్నాయి.

‘మయాంతి లాంగర్.. బాబు చాలా బాగున్నారు’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ‘ఐపీఎల్‌లో నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. అందమైన బాబు మిమ్మల్ని బిజీగా ఉంచుతున్నాడు. దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు’, ‘త్వరలోనే మిమ్మల్ని చూస్తాం అని ఆశిస్తున్నా’, ‘మేడమ్.. ఐపీఎల్ 2020లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో పనిచేస్తున్న మయాంతి.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న విషయం తెలిసిందే.